Kadapa: ఉగాది నాటికి ఇంటి పట్టాలు ఇచ్చేందుకు సిద్ధం: డిప్యూటీ సీఎం
నగర శివారులోని ఉక్కాయపల్లి లే ఔట్ ను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా పరిశీలించారు.
కడప: నగర శివారులోని ఉక్కాయపల్లి లే ఔట్ ను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఉగాదికి కడపలో లబ్ధిదారులకు ఇంటి పట్టాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేయనున్నదని, ఇందుకోసం ఉక్కాయపల్లిలో స్థలాన్ని పరిశీలించి పేదలకు ఇవ్వడానికి సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు కడప నియోజకవర్గ పరిధిలో 22 వేల మంది లబ్ధిదారులను గుర్తించామని, 22 వేల మందికి ఫ్లాట్ లను అందజేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
రూరల్ ప్రాంతాల్లో 1.5 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో1 సెంటు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ప్రతి లబ్దిదారునికి ఇంటి పట్టాను అందజేస్తామని పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని సాహసాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేశారని, ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సురేష్ బాబు, వైసీపీనేతలు పాల్గొన్నారు.