నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలపై హైకోర్టు స్టే - ఎన్నికల ప్రక్రియ చేపట్టవద్దంటూ ఆదేశాలు
మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల పునర్విభజనకు సంబంధించిన, తుది నోటిఫికేషన్ విడుదలపై హైకోర్టు స్టే విధించింది.
నెల్లూరు: మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల పునర్విభజనకు సంబంధించిన, తుది నోటిఫికేషన్ విడుదలపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు, ఈ స్టే అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై సంబంధిత పత్రాలను, తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల పునర్విభజన చట్టం-1996 నిబంధనలకు విరుద్ధంగా, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల పునర్విభజన జరిగిందని, అందువల్ల దానికి సంబంధించిన తుది నోటిఫికేషన్ను నిలుపుదల చేయాలని కోరుతూ... నెల్లూరుకు చెందిన వి.భువనేశ్వరి ప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. పునర్విభజనపై అభ్యంతరాలకు తగిన గడువు ఇవ్వలేదని తెలిపారు. వార్డుల పునర్విభజన అంశానికి సంబంధించిన పత్రాల సమర్పణకు, మరికొంత గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థించగా, న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.