రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. రూ.20 కే కేజీ గోధుమ పిండి..!

Ration Card Holders: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2026-02-09 05:36 GMT

Ration Card Holders: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కిలో గోధుమ పిండిని కేవలం రూ.20లకే అందించే నూతన కార్యక్రమాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం గుంటూరు జిల్లా తెనాలిలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రేషన్ పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వం తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులను ఆయన వివరించారు.

ఆరోగ్యానికి రేషన్ బియ్యమే మేలు

రేషన్ బియ్యంపై ప్రభుత్వం పెడుతున్న ఖర్చును వివరిస్తూ.. కిలో బియ్యంపై సర్కార్ రూ.47.10 వెచ్చిస్తోందని మంత్రి తెలిపారు. పాలిష్ చేసిన సన్నబియ్యం కంటే, రేషన్‌లో ఇచ్చే బియ్యమే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో 1,800 టన్నుల గోధుమపిండిని పంపిణీ చేస్తున్నామని, త్వరలోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు దీనిని విస్తరిస్తామని స్పష్టం చేశారు.

స్మార్ట్ రేషన్ కార్డులు - ఎక్కడైనా సరుకులు

గత ప్రభుత్వ పాలనపై విమర్శలు చేస్తూ, గతంలో రేషన్ పంపిణీ కేవలం కొందరికి మాత్రమే ప్రయోజనం చేకూరేలా ఉండేదని మంత్రి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో ప్రజల సౌకర్యార్థం రేషన్ షాపుల పనివేళలను మార్చినట్లు తెలిపారు. నెలకు 15 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు షాపులు అందుబాటులో ఉంటాయి. కొత్తగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా లబ్ధిదారులు రాష్ట్రంలో ఏ చౌకధరల దుకాణం నుండైనా సరుకులు పొందే వెసులుబాటు కల్పించారు.

డీలర్లకు అదనపు ఆదాయం

రేషన్ డీలర్ల సంక్షేమాన్ని కూడా ప్రభుత్వం విస్మరించలేదని మంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో కొండ ప్రాంతాల ఉత్పత్తులు, సేంద్రియ సాగు పంటలను రేషన్ షాపుల ద్వారా విక్రయించేలా చర్యలు తీసుకుంటామని, దీనివల్ల ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులు అందడంతో పాటు డీలర్లకు అదనపు ఆదాయం లభిస్తుందని మనోహర్ వెల్లడించారు.

Tags:    

Similar News