Tirumala Darshan Tickets : క్లిక్ చేస్తే చాలు దర్శనం ఖరారు..శ్రీవారి భక్తులకు ఇక వాట్సాప్లో నిమిషాల్లోనే దర్శనం టికెట్లు
క్లిక్ చేస్తే చాలు దర్శనం ఖరారు..శ్రీవారి భక్తులకు ఇక వాట్సాప్లో నిమిషాల్లోనే దర్శనం టికెట్లు
Tirumala Darshan Tickets : కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి దర్శనం అంటే భక్తులకు అదో పరవశం. కానీ ఆ టికెట్లు దొరకడమే ఒక యుద్ధంలా ఉండేది. ఆన్లైన్ రిలీజ్ చేసిన నిమిషాల్లోనే ఖాళీ అయిపోవడమో, లేక క్యూ లైన్లలో గంటల తరబడి నిల్చోవడమో ఇప్పటివరకు చూశాం. అయితే భక్తుల కష్టాలు తీర్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చింది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. కేవలం ఒక వాట్సాప్ మెసేజ్తో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఒక్క తిరుమలనే కాదు, ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నింటినీ ఈ పరిధిలోకి తెచ్చారు.
దర్శనం టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి?
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈ వినూత్న సేవలను ప్రారంభించింది. దీనికోసం 95523 00009 అనే ప్రత్యేక వాట్సాప్ నెంబర్ను కేటాయించారు. ఈ విధానం చాలా సింపుల్గా ఉంటుంది:
* ముందుగా మీ మొబైల్లో 95523 00009 నెంబర్ను సేవ్ చేసుకోండి.
* వాట్సాప్లోకి వెళ్లి ఆ నెంబర్కు 'Hi' అని మెసేజ్ పంపండి.
* వెంటనే మీకు కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో సేవలు ఎంచుకోండి (Select Services) క్లిక్ చేయాలి.
* కిందకు స్క్రోల్ చేస్తే దేవాలయ బుకింగ్ సేవలు అనే ఆప్షన్ కనిపిస్తుంది.
* దాన్ని క్లిక్ చేయగానే తిరుమల, శ్రీశైలం, కాణిపాకం, అన్నవరం, విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీకాళహస్తి వంటి ప్రముఖ ఆలయాల పేర్లు వస్తాయి.
* మీకు కావాల్సిన ఆలయాన్ని ఎంచుకుని, భక్తుల వివరాలు ఇచ్చి బుకింగ్ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.
అన్నీ ఒకే చోట.. అద్భుతమైన వెసులుబాటు
ఇప్పటివరకు టీటీడీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకునే వీలుండేది. అయితే గ్రామీణ ప్రాంతాల వారికి, యాప్స్ వాడటం రాని వారికి ఈ వాట్సాప్ బుకింగ్ ఒక వరం లాంటిది. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. కేవలం దర్శనం టికెట్లు మాత్రమే కాదు, ఆలయాల్లో జరిగే వివిధ రకాల సేవలు, ప్రసాదాలు, వసతి వివరాలను కూడా ఈ నెంబర్ ద్వారా తెలుసుకునే వీలు కల్పిస్తున్నారు. వెబ్సైట్ సర్వర్లు మొరాయించే సమయంలో కూడా వాట్సాప్ సేవలు వేగంగా పనిచేస్తాయని అధికారులు చెబుతున్నారు.
డిజిటల్ ఏపీ
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ మిత్ర పోర్టల్ ద్వారా పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు. దళారుల బెడద లేకుండా నేరుగా భక్తులే తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. దీనివల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, ప్రయాణానికి ముందే దర్శనం ఖరారు చేసుకోవడం భక్తులకు పెద్ద ఊరట. ఏపీలోని దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని ప్రధాన ఆలయాలను ఒకే వాట్సాప్ నెంబర్ పరిధిలోకి తీసుకురావడం డిజిటల్ గవర్నెన్స్లో ఒక గొప్ప అడుగు.