దసరా తరువాత జనసేన నుంచి ఆ కీలకనేత కూడా జంపా!
దసరా తరువాత జనసేన నుంచి ఆ కీలకనేత కూడా జంపా!
ఏపీలో మరోసారి వలసలు ఊపందుకున్నాయి. జనసేన నుంచి కీలకనేతలు తమదారి తాము చూసుకుంటున్నారు. ఈ క్రమంలో కుదిరితే వైసీపీ లేదంటే బీజేపీ లను ఎంచుకుంటున్నారు. ఈనెలలో ఆ పార్టీకి భారీ ఎదురు దెబ్బలు తగిలాయనే చెప్పాలి.. ఆ పార్టీకి చెందిన మాజీ ఐఆర్ఎస్ అధికారి చింతల పార్ధసారధి, మాజీ ఎమ్మెల్యేలు, ఆకుల సత్యనారాయణ, చింతలపూడి వెంకటరామయ్యలు రాజీనామా చేశారు. ఈ వరుసలో మరో నేత కూడా ఉన్నాడన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయనే పసుపులేటి బాలరాజు.. ఉత్తరాంధ్రలో ఓ వెలుగు వెలిగిన ఆయన ప్రస్తుతం రాజకీయంగా అయోమయంలో పడ్డారు. ఇటు జనసేనలో ఉండలేక.. అటు పక్క పార్టీనుంచి క్లియరెన్స్ రాక తెగ ఇబ్బంది పడుతున్నారట. ఎన్నికల ముందే జనసేనలో చేరిన ఆయన ఇప్పుడు వైసీపీలో చేరాలని తెగ ఉవ్విలూరుతున్నారట. వాస్తవానికి 2017 లోనే వైసీపీలో చేరాలని గట్టి ప్రయత్నాలు చేశారు బాలరాజు. అయితే స్థానిక వైసీపీ నాయకత్వం వ్యతిరేకించడంతో అది కుదరలేదు.
దీంతో టీడీపీలో చేరాలని ప్రయత్నాలు చేసినా గిడ్డి ఈశ్వరి అడ్డుతగిలిందన్న ప్రచారం అప్పట్లో జరిగింది. ఈ దశలో ఏదో ఒక పెద్ద పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంటుంది.. తద్వారా పొత్తులో భాగంగా సీటు వస్తుందన్న కారణంతో జనసేనలో చేరారు. కానీ ఆయన అంచనాలు తారుమారు అయ్యాయి. ఆ పార్టీ పొత్తు కేవలం కమ్యూనిస్టుకు మాత్రమే పరిమితం అయింది. దాంతో ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఘోర ఓటమిని చవిచూశారు. ఫలితాల అనంతరం పత్తా లేకుండా పోయారు. వైసీపీలో చేరాలని ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు ఏజన్సీలో ప్రచారం జరుగుతోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో ఏజన్సీలో మరింత బలం పెంచుకోవాలనుకుంటున్న వైసీపీ బాలరాజును చేర్చుకుంటే మేలనే భావనలో ఉందట.. అయితే ఆయన చేరికకు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే కుంభా రవి వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందట. దీంతో ఆయన చేరిక ఆలస్యం అవుతుందట. మరోవైపు దసరా తరువాత ఆటో ఇటో తేల్చుకోవాలని బాలరాజు అనుకుంటున్నారట. ఇదే జరిగితే జనసేనకు మరో ఎదురుదెబ్బ ఖాయమనే చెప్పాలి.