Weather Update : బంగాళాఖాతంలో భారీ సుడిగుండం.. ఏపీ, తెలంగాణలో మారనున్న వాతావరణం
Weather Update : బంగాళాఖాతంలో భారీ ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో మార్చి 9న ఏపీ, తెలంగాణల్లో ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచన.
Weather Update
Weather Update : బంగాళాఖాతంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మయన్మార్కు పశ్చిమంగా సముద్రంలో భారీ ఎత్తున గాలి ఆవర్తనం ఏర్పడింది. దీని విస్తీర్ణం దాదాపు మన తెలంగాణ రాష్ట్రమంత ఉందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం గంటకు 21 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఈ ఆవర్తనం, నెమ్మదిగా ఉత్తరాంధ్ర, ఒడిశా తీరం వైపుగా కదులుతోంది. దీని ప్రభావంతో మార్చి 9వ తేదీ నాటికి ఏపీ తీరానికి వాతావరణ ముప్పు పొంచి ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు ఇలా
ఇవాళ (మార్చి 8) పగటిపూట ఎండలు భగభగమంటూ మండిపోతాయి. కానీ, అసలు కథ రాత్రి 8 గంటల తర్వాత మొదలవుతుంది. ఉత్తరం దిశ నుంచి దట్టమైన మేఘాలు ఉత్తరాంధ్రలోకి ప్రవేశిస్తాయి. రాత్రి గడిచే కొద్దీ ఇవి ఏపీ మొత్తం వ్యాపించడమే కాకుండా, అర్థరాత్రి సమయానికి ఉత్తర తెలంగాణ జిల్లాలను కూడా కమ్మేస్తాయి. రేపు అంటే మార్చి 9న ఉభయ రాష్ట్రాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడా చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాన చినుకులు పడే ఛాన్స్ ఎక్కువగా ఉంది. దీనివల్ల ఎండ తీవ్రత రేపు కాస్త తగ్గుముఖం పట్టవచ్చు.
రైతులకు అత్యవసర హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ రైతులకు వాతావరణ శాఖ కీలక సూచన చేసింది. మార్చి 9న వాతావరణం అస్థిరంగా ఉంటుంది కాబట్టి, పొలాల్లో ఉన్న ధాన్యం గానీ, ఇతర పంట ఉత్పత్తులను గానీ తడవకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలి. ఈ ఆవర్తనం సముద్రంలోనే స్థిరంగా కొనసాగే అవకాశం ఉన్నందున, రాబోయే కొన్ని రోజుల పాటు తీర ప్రాంతాల్లో మేఘాలు కమ్మేయడం, జల్లులు పడటం వంటి మార్పులు కనిపిస్తూనే ఉంటాయి. కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండటం మంచిది.
ఎండలు ఎందుకు మండుతున్నాయి? వర్షాల పరిస్థితి ఏంటి?
ప్రస్తుతం ఆకాశంలో మేఘాలు కనిపిస్తున్నప్పటికీ ఎండలు తగ్గకపోవడానికి కారణం గాలుల దిశ. సముద్రం నుంచి రావాల్సిన చల్లని గాలులు రావడానికి ఇంకా రెండు నెలల సమయం పడుతుంది. మరోవైపు సూర్యుడి నుంచి వస్తున్న అత్యంత వేడి గాలులు (సౌర తుపాన్లు) భూమిని వేడెక్కిస్తున్నాయి. ఐతే, ఈ వేడి వల్ల సముద్రాలపై భారీగా మేఘాలు పోగవుతున్నాయి. ఫలితంగా ఈ ఏడాది జూన్ నుంచి మొదలయ్యే వర్షాకాలంలో రికార్డు స్థాయి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం మే నెల వరకు ఎండల సెగ తప్పేలా లేదు.