అడుగుపెట్టారో లేదో.. కేసులో ఇరుక్కున్నారు! మాజీ సీఎం చంద్రబాబుపై తొలి కేసు
దాదాపు రెండు నెలల విరామం తరువాత ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ నుంచి కాన్వాయ్లో బయలుదేరిన చంద్రబాబు పలుచోట్ల కారు దిగి మరీ జనాలను పలకరించారు. దీంతో బాబు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి, కరోనా వైరస్ వ్యాప్తికి పరోక్షంగా కారణమయ్యారంటూ చిత్తూరు జిల్లాకు చెందిన మొమమ్మద్ అలీ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు లాక్డౌన్ రూల్స్ ఉల్లఘించారని వీడియోలను ఆధారాలు సమర్పిస్తూ ఏపీ డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్, కృష్ణా జిల్లా ఎస్పీతో పాటు తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్లో అలీ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుకు సంబంధించిన కాపీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా దీనిపై తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు కూడా తెలుస్తోంది. ఇదిలా ఉంటే చంద్రబాబు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ వైసీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి ఏకంగా హైకోర్టుకే ఫిర్యాదు చేయడం గమనర్హం. కాగా ఇవాళ విశాఖకు వెళ్లనున్న చంద్రబాబు అక్కడ స్టెరీన్ గ్యాస్ బాధితులను కలవనున్నారు.
వాస్తవానికి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి నేరుగా విమానంలో విశాఖపట్నం వెళ్ళాల్సి ఉంది. అయితే చివరి క్షణాల్లో విశాఖపట్నం వెళ్ళే విమానాలు రద్దుచేయడంతో ఆయన రోడ్డు మార్గంలో ఉండవల్లి చేరుకున్నారు. ఈ నేపధ్యంలో పార్టీ శ్రేణులు ఆయనకు స్వాగతం చెబుతూ హడావుడి చేశాయి. దీనికి చంద్రబాబు కూడా స్పందించి మార్గ మధ్యంలో తనకు స్వాగతం చెబుతున్న కార్యకర్తలు, నాయకులకు కారు దిగి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఇప్పుడు ఈ హడావుడే చంద్రబాబుకు తలనొప్పులు తెచ్చిపెట్టింది.