తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తిరుమలకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడం తోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మధ్యాహ్నం 3గంటలకు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి రేణిగుంట చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డు మార్గాన తిరుపతి చేరుకుంటారు. సాయంత్రం 4.15గంటలకు 'అలిపిరి- చెర్లోపల్లి' జంక్షన్లో నాలుగులైన్ల రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
ఆ తరువాత 5.15గంటలకు తిరుమలలో మాతృశ్రీ వకుళాదేవి యాత్రికుల వసతి సముదాయానికి శంకుస్థాపన చేసి, ఆ వెంటనే పద్మావతి అతిథిగృహానికి చేరుకుంటారు. అక్కడ కాసేపు విశ్రాంతి అనంతరం రాత్రి 7గంటలకు ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు అనంతరం అక్కడ జరిగే పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారు. సోమవారం రాత్రి జగన్ తిరుమలలోనే బస చేస్తారు. మంగళవారం ఉదయం తాడేపల్లి చేరుకోనున్నారు. ఇక ఈ షెడ్యూల్ కంటే ముందు జగన్.. సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు విజయవాడలోని తుమ్మలపల్లి కళా క్షేత్రంలో నియామక ఉత్తర్వులు అందజేస్తారు.