ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్పై సీఎం జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విచక్షణ కోల్పోయినట్లుగా ప్రవర్తించారన్నారు. రమేష్ కుమార్ ను రాష్ర్ట ఎన్నికల అధికారిగా చంద్రబాబు నియమించిన వ్యక్తి అన్నారు. ఎన్నికల కమిషనర్ కులాలు, మతాలు, ప్రాంతాలు పార్టీలకు అతీతంగా పని చేయాలని సీఎం జగన్ అన్నారు. ఎన్నికలు వాయిదా వేసే ముందు ప్రభుత్వ అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్లు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేసే అధికారం ఈసీకి ఎవరు ఇచ్చారన్నారు.
కేవలం చంద్రబాబు సీఎం కాలేదన్న కారణంతోనే ఎన్నికలు వాయిదా వేశారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజలు ఓట్లేసి 151 స్థానాలు ఇస్తే తాము అధికారంలో ఉన్నామని.. అధికారం జగన్ మోహన్రెడ్డిదా.. లేదా రమేశ్ కుమార్దా? అని ఘాటుగా ప్రశ్నించారు. బుర్రలో క్లారిటీ ఉండాలంటూ మండిపడ్డారు. ఏమన్నా అంటే విచక్షణ అధికారం అంటారని.. ఈ మధ్య ఇదో ఫ్యాషనైపోయిందన్నారు. ప్రజలు ఓట్లేసి ఎమ్మెల్యేలు ఎన్నుకోవడం ఎందుకన్నారు.
ఇక ఎన్నికల వాయిదాపై ఏపీ సీఎం జగన్ చేసిన ఆరోపణలపై ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ స్పందించారు. కరోనాపై జాతీయ స్థాయిలో హెచ్చరికలు., సంప్రదింపులు జరిగిన తర్వాతో ఎన్నికలను వాయిదా వేసినట్లు చెప్పారు. కరోనా ఎఫెక్ట్ తగ్గితే ఆరు వారాలు లేదా అంతకన్నా ముందే ఎన్నికలు జరుపుతామని స్పష్టం చేశారు.
రాష్ర్ట ఎన్నికల కమిషన్ రాజ్యాంగ సంస్థ.. హైకోర్టు న్యాయమూర్తికి ఉండే విశేష అదికారాలు రాష్ర్ట ఎన్నికల కమిషన్ కు ఉంటాయని చెప్పారు. ప్రశాంతమైన వాతావరణంలో ఏ పార్టీకి లబ్ది చేకూర్చకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చెప్పారు.