సుహానాకు సత్వర సహాయం: చిన్నారి కారుణ్య మరణ పిటిషన్ పై స్పందించిన సీఎం జగన్
ఏడాది వయసున్న తమ కుమారుడు 'సుహానా'కు కారుణ్య మరణం ప్రసాదించాలని చిత్తూరు జిల్లా దంపతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. చిన్నారి కారుణ్య పిటిషన్ గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిన్నారికి అవసరమైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. చిన్నారి ఆరోగ్యం గురించి చిత్తూరు జిల్లా కలెక్టర్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. చికిత్సకు అవసరమయ్యే ఖర్చును సీఎం సహాయనిధి నుంచి విడుదల చేశారు. అలాగే రోజువారీగా అవసరమయ్యే ఇన్సులిన్ను ప్రభుత్వ ఆసుపత్రి నుంచే ఉచితంగా అందించాలని కలెక్టర్కు సూచించారు. ఎప్పటికప్పుడు చిన్నారి ఆరోగ్య స్థితిని తనకు తెలియజేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
కాగా చిత్తూరు జిల్లా, బి.కొత్తకోట మండలం బీసీ కాలనీలో నివాసం ఉంటున్న బావాజాన్, షబానా దంపతులు కూలి పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడదు. సొంతిల్లు కూడా లేని దుస్థితి వారిది. ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. మొదట్లో ఇద్దరు పిల్లలు పుట్టి రోజుల వ్యవధిలోనే సుగర్ స్థాయి పడిపోవడంతో ఆ ఇద్దరూ చనిపోయారు. మూడో సంతానంగా రెడ్డి సుహానా (1) జన్మించింది. పాపకు ఏడాది వయసు వచ్చినా ఎదుగుదల లేదు. దీంతో డాక్టర్లకు చూపిస్తే.. ఆ చిన్నారికి సుగర్ లెవల్స్ తక్కువగా ఉన్నాయని.. అందువల్లే ఎదుగుదల లేదని డాక్టర్లు చెప్పారు. ఈ క్రమంలో పాప వైద్యం కోసం అన్ని చోట్ల అప్పులు చేసి అప్పులపాలయ్యారు. దీంతో చికిత్స కోసం డబ్బు లేకపోవడంతో తమ కూతురుకి కారుణ్య మరణం ప్రసాదించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.