Botsa Satyanarayana: "మంత్రులు ప్రభుత్వం నడుపుతున్నారా.. హెరిటేజ్ డైరెక్టర్లా?" - చంద్రబాబుపై బొత్స సత్యనారాయణ నిప్పులు!
Botsa Satyanarayana: తిరుమల లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ స్వలాభం కోసమేనని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు.
Botsa Satyanarayana: "మంత్రులు ప్రభుత్వం నడుపుతున్నారా.. హెరిటేజ్ డైరెక్టర్లా?" - చంద్రబాబుపై బొత్స సత్యనారాయణ నిప్పులు!
Botsa Satyanarayana: తిరుమల లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ స్వలాభం కోసమేనని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. శనివారం అమరావతిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై వివరణ ఇచ్చారు.
చంద్రబాబు నాయుడు తన కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్కు అనుబంధంగా ఉన్న 'ఇందాపూర్ డైరీ'కి నెయ్యి కాంట్రాక్టులు ఇప్పించుకోవడానికే శ్రీవారి ప్రసాదంపై దారుణమైన నిందారోపణలు చేశారని బొత్స ఆరోపించారు. "నాలుగు రోజులుగా ఈ దోపిడీపై చర్చకు డిమాండ్ చేస్తున్నాం. చర్చ జరిగితే ఆధారాలతో సహా అన్ని వాస్తవాలు ప్రజలకు చూపిస్తాం" అని సవాల్ విసిరారు.
చెప్పుల వివాదంపై క్లారిటీ
అసెంబ్లీలో దేవుడి ఫోటోలు పట్టుకుని చెప్పులతో నిలబడ్డారన్న విమర్శలపై బొత్స ఘాటుగా స్పందించారు. "మేము చెప్పులు తీసే దేవుడి ఫోటోలతో నిరసన తెలిపాం. ఎక్కడైనా ఒక్క సభ్యుడు చెప్పులతో ఉన్నట్లు లేదా ఒక్క ఫోటో కింద పడినట్లు చూపించగలరా?" అని ప్రశ్నించారు. కాళ్లకు బూట్లు వేసుకుని పూజలు చేసే స్వభావం చంద్రబాబుదేనని, దేవుడిని అపవిత్రం చేస్తున్న వ్యక్తి ఆయనేనని మండిపడ్డారు.
మంత్రులేమైనా డైరెక్టర్లా?
ప్రైవేట్ సంస్థ అయిన హెరిటేజ్ గురించి ప్రభుత్వ మంత్రులు వకాల్తా పుచ్చుకోవడంపై బొత్స విస్మయం వ్యక్తం చేశారు. "మంత్రులు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నారా లేక హెరిటేజ్ సంస్థకు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారా? నారా భువనేశ్వరి గారికి మాట్లాడే అర్హత ఉంది, కానీ మంత్రులకు ఆ సంస్థతో ఏం పని?" అని నిలదీశారు. తక్షణమే తిరుమల లడ్డూ వ్యవహారంపై చర్చకు సమయం కేటాయించాలని, దేవుడి పవిత్రతను కాపాడాలని బొత్స డిమాండ్ చేశారు.