భారీగా లాభాలను ఆర్జించిన ఏపీఎస్ఆర్టీసీ
భారీగా లాభాలను ఆర్జించిన ఏపీఎస్ఆర్టీసీ భారీగా లాభాలను ఆర్జించిన ఏపీఎస్ఆర్టీసీ
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ)కి దసరా సీజన్లో భారీగా ఆదాయం వచ్చింది. దసరా సీజన్లో మొత్తం రూ.229 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2018 దసరా సమయంలో రూ.209 కోట్లు, ఈసారి రూ.229 కోట్ల ఆదాయం రావడంతో గతఏడాది కంటే కూడా ఈసారి రూ.20 కోట్లు అధికంగా వచ్చినట్టయింది. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె కూడా ఏపీఎస్ఆర్టీసీకి కలిసొచ్చింది. ఈ పండక్కి అదనంగా 5,887 ప్రత్యేక బస్సులను తిప్పిన ఏపీఎస్ఆర్టీసీ ఈ సర్వీసుల్లో 50 శాతం అధిక ఛార్జీలు వసూలు చేసింది. దాంతో గణనీయమైన ఆదాయాన్ని రాబట్టగలిగింది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 13వ తేదీ వరకు ప్రయాణికులు అధికంగా ప్రయాణించినట్టు అధికారులు వెల్లడించారు.
కాగా ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చేదే కానీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ప్రభుత్వం కొరడా ఝళిపించింది. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ కూడా టిక్కెట్ల ధర తగ్గించడంతో ప్రయాణికులు ప్రైవేటు ట్రావెల్స్ ను ఆశ్రయించడంతో మరికొంత ఆదాయం తగ్గింది. ఇదిలావుంటే ఏపీఎస్ఆర్టీసీలో ప్రతిరోజూ 71 లక్షల మంది ప్రయాణిస్తారు. దాంతో రోజుకు రూ.13 కోట్ల ఆదాయం ఛార్జీల రూపంలో వస్తుంది. మరోవైపు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్) ఏకంగా 103 శాతంగా నమోదైంది.