సీఎం జగన్ మాటగా నేను చెబుతున్నా.. వారికే అవకాశం ఇవ్వండి : బొత్స

వైసీపీ గెలుపు కోసం గత ఎన్నికల్లో కష్టించి పని చేసిన వారినే స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబెట్టాలని పార్టీ శ్రేణులకు మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు.

Update: 2020-03-06 16:08 GMT
Botsa satyanarayana File Photo

వైసీపీ గెలుపు కోసం గత ఎన్నికల్లో కష్టించి పని చేసిన వారినే స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబెట్టాలని పార్టీ శ్రేణులకు మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. సీఎం జగన్ మాటగా తాను చెబుతున్నానని అన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యతను ఇస్తామని తెలిపారు.

పార్టీలకు అతీతంగా అందరికీ ఉగాది సందర్భంగా ఇంటి స్థలాలను ఇస్తామని బొత్స చెప్పారు. అర్హులైన అందరికీ ఇప్పటికే పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లను ఇవ్వడం ఒక చరిత్ర అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ చేయకూడదని ముఖ్యమంత్రి చట్టం చేశారని... ఈ మేరకు ఇప్పటికే గ్రామ వాలంటీర్లకు స్పష్టమైన ఆదేశాలను ఇవ్వడం జరిగిందని చెప్పారు. పార్టీలో అంతర్గత విబేధాలను పక్కన పెట్టేయాలని అన్నారు. అన్ని స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలవాల్సిందేనని చెప్పారు.

Tags:    

Similar News