Weather Update : తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం.. ఓవైపు నిప్పుల వర్షం.. మరోవైపు పిడుగుల వాన

Weather Update : ఏపీలో వడగాలులు, పిడుగులతో కూడిన వర్షాల హెచ్చరిక. తెలంగాణకు 10 రోజుల పాటు రెడ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ సూచించింది.

Update: 2026-04-10 01:37 GMT

Weather Update

Weather Update : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం వింతగా మారుతోంది. ఒకవైపు భానుడు తన ప్రతాపం చూపిస్తూ ఉష్ణోగ్రతలను పెంచేస్తుంటే, మరోవైపు అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తాజాగా విడుదల చేసిన హెచ్చరికల ప్రకారం, రాష్ట్రంలో వేడి గాలులతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేడి గాలులు తీవ్రంగా వీస్తాయని, రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించారు. ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లోని పలు మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉంది. శనివారం నాటికి ఈ ప్రభావం ఏకంగా 54 మండలాలకు విస్తరించనుంది. ఇప్పటికే నంద్యాల, కడప, ప్రకాశం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు చేరువలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

అకాల వర్షాలు - పిడుగుల భయం

తమిళనాడు నుంచి తెలంగాణ వరకు విస్తరించి ఉన్న వాతావరణ ద్రోణి ప్రభావంతో ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా. ఈ అకాల వర్షాల వల్ల రైతులు తమ పండించిన పంటను కాపాడుకోవాలని, పిడుగులు పడే సమయంలో చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని అధికారులు సూచిస్తున్నారు.

తెలంగాణకు 10 రోజుల రెడ్ అలెర్ట్

తెలంగాణ పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతోంది. భారత వాతావరణ విభాగం (IMD) ఏప్రిల్ 12 నుంచి 22 వరకు పది రోజుల పాటు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల వంటి ప్రాంతాల్లో ఎండలు 45 డిగ్రీల వరకు వెళ్లే అవకాశం ఉంది. సాధారణంగా మే నెలలో ఉండే ఎండలు ఈసారి ఏప్రిల్ లోనే వచ్చేస్తున్నాయి. సాయంత్రం పూట జల్లులు పడినా, అవి వేడిని తగ్గించకుండా కేవలం గాలిలో తేమను పెంచి ఉక్కపోతను రెట్టింపు చేస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు.

హైదరాబాద్ లో హీట్ ఐలాండ్ ఎఫెక్ట్

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కూడా ఎండల తీవ్రత పెరగనుంది. రాబోయే పది రోజులు నగరంలో 40 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నిలకడగా కొనసాగవచ్చు. నగరంలో కాంక్రీట్ భవనాల వల్ల రాత్రి వేళల్లో కూడా వేడి తగ్గకుండా ఉండే హీట్ ఐలాండ్ ప్రభావం కనిపిస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, తగినంత నీరు తాగుతూ ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News