8 రాష్ట్రాల్లో 32లక్షల మంది నుంచి భారీగా దోచుకున్న అగ్రిగోల్డ్ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. ఇప్పటికే అగ్రిగోల్డ్కు సంబంధించి పలు దఫాలుగా ఆస్తులను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.. తాజాగా మరికొన్ని ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంది ప్రభుత్వం. అగ్రిగోల్డ్ ఫార్మ్ ఎస్టేట్స్ ఇండియా తోపాటు హీరా గ్రూపు, సోనాల్ భూమి నిర్మాణ అండ్ ఫార్మ్స్ ఇండియా, ఇండిట్రేడ్ క్యాపిటల్ లిమిటెడ్ సంస్థల ఆస్తులను కూడా స్వాధీనపరుచుకుంది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కిషోర్కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా స్వాధీన పరుచుకున్న అగ్రిగోల్డ్ ఆస్తుల్లో 25,917 చదరపు గజాల స్థలాలు, 56,407 చదరపు అడుగుల నిర్మాణ భవనాలు, 56.85 ఎకరాల భూమి ఉన్నాయి. దీని విలువ రూ.26.53 కోట్లు అని గుర్తించినట్లు సీఐడీ అధికారులు గత నెలలో తెలిపారు. ఈ ఆస్తులు గుంటూరు, నెల్లూరు, విశాఖ, ప్రకాశం, అనంతపురంలో జిల్లాల్లో ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది.
ఇదిలావుంటే ఫ్యాన్సీ వ్యాపారం పేరుతో జనాలకు టోకరా వేసిన హీరా గ్రూప్ సీఈవో షేక్ నౌహీరాకు చెందిన 524.49 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అలాగే సోనాల్ భూమి నిర్మాణ అండ్ ఫార్మ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించి రూ.88.78 లక్షల విలువైన 13.34 ఎకరాల భూమిని ప్రభుత్వం జప్తు చేసింది.. ఈ భూమి విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం పాతమల్లంపేటలో ఉన్నట్టు గుర్తించింది. ఇక ఇండిట్రేడ్ క్యాపిటల్ లిమిటెడ్ పేరిటశ్రీకాకుళం జిల్లా టంకాల శ్రీరామ్కు చెందిన రూ.1.65 కోట్ల విలువైన 27.08 ఎకరాల భూములతోపాటు రూ.11.62 లక్షల ఆభరణాలు, రూ.12 లక్షల విలువచేసే వాహనాలను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.