ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీని విలీనం చేస్తున్నట్టు జగన్ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయించిన ఆంజనేయరెడ్డి కమిటీ ఆర్టీసీ విలీనాన్ని చేయొచ్చని నివేదిక ఇచ్చింది. దీంతో విలీన ప్రక్రియను ఏపీ సర్కార్ వేగవంతం చేసింది. ఈ ప్రక్రియను పూర్తి చేసేందు వర్కింగ్ గ్రూప్ను ఏర్పాటు చేసింది. ఆర్థిక,రవాణ,జీఏడీ, న్యాయశాఖలకు సంబంధించిన ఏడుగురు ఉన్నతాధికారులను వర్కింగ్ గ్రూప్ లో సభ్యులుగా చేర్చి జీవో జారీ చేసింది.
వచ్చే నెల 15వ తేదీ లోగా వర్కింగ్ గ్రూప్ తన నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ప్రజా రవాణాశాఖ ఏర్పాటు, డిజిగ్నేషన్లు,పోస్టులు,పేస్కేల్ విధి విధానాలపై వర్కింగ్ గ్రూప్ ప్రతిపాదనలు సిద్దం చేయడం వంటివి ఈ గ్రూప్ చెయ్యాల్సి ఉంటుంది. వర్కింగ్ గ్రూప్ నివేదికను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం విలీనంపై ఫైనల్ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
కాగా, ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ గత కొన్నేళ్లుగా వినిపిస్తోంది. వైసీపీ అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని జగన్ ప్రకటించారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ హామీని పొందుపరిచారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి కేబినెట్ భేటీలోనే విలీనంపై నిర్ణయం తీసుకున్నారు జగన్. ఈ క్రమంలోనే విలీన ప్రక్రియ జరుగుతోంది.