AP News: అనాథ పిల్లలకు పింఛన్లు.. ప్రభుత్వం కీలక నిర్ణయం.
AP News: రాజధాని అమరావతికి అంతర్జాతీయ స్థాయి పర్యాటక శోభ తీసుకొచ్చే దిశగా మరో కీలక అడుగు పడింది.
AP News: రాజధాని అమరావతికి అంతర్జాతీయ స్థాయి పర్యాటక శోభ తీసుకొచ్చే దిశగా మరో కీలక అడుగు పడింది. కృష్ణా నదీ తీరాన్ని మెరీనా వాటర్ ఫ్రంట్గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన 57వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.
ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో భాగంగా రాజధానిలో భూమి లేని నిరుపేదలకు అందిస్తున్న పెన్షన్లను ఇకపై మైనర్లయిన అనాథలకు వర్తింపజేయాలని సమావేశం నిర్ణయించింది. తల్లిదండ్రులను కోల్పోయిన మైనర్లకు నెలకు 5 వేల చొప్పున పెన్షన్ అందించనున్నారు. అదే సమయంలో ఏపీ సీఆర్డీఏలో వివిధ కేడర్లకు చెందిన మొత్తం 754 పోస్టుల ర్యాటిఫికేషన్కు అథారిటీ ఆమోదం తెలిపింది. రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్లలో వీధి శూల ఉన్న 112 ప్లాట్లకు బదులుగా ప్రత్యామ్నాయ ప్లాట్ల కేటాయింపునకు అంగీకారం తెలిపింది. అయితే మ్యుటేషన్ జరగని, థర్డ్ పార్టీకి విక్రయించని ప్లాట్లకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుందని స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్, సీఆర్డీఏ సంస్థలు ఆర్థికంగా మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇందుకోసం వివిధ రెవెన్యూ మోడల్స్ను అధ్యయనం చేసి, ఆస్తుల ఆధారంగా సుస్థిర ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. స్పోర్ట్స్ సిటీ వంటి భారీ ప్రాజెక్టుల అమలుకు ఖతార్ మోడల్ను పరిశీలించాలని, అమరావతిలో చేపట్టిన రాజధాని నిర్మాణ పనులు నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు.
మెరీనా వాటర్ ఫ్రంట్ ప్రాజెక్ట్లో భాగంగా జెట్టీలు, లీజర్ టూరిజం బోట్లు, ఫుడ్ ప్లాజాలు, ల్యాండ్స్కేప్ పనులను పీపీపీ విధానంలో చేపట్టాలని సీఎం ఆదేశించారు. వాటర్ ఫ్రంట్ అభివృద్ధికి స్పష్టమైన మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని, రివర్ ఫ్రంట్తో పాటు వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీలు ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. బ్లూ–గ్రీన్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దే క్రమంలో అంతర్గత కాలువల నిర్మాణం, వాటి సుందరీకరణ పనులు చేపట్టాలని తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ ఎగువన నిర్మించనున్న కొత్త బ్యారేజ్ ద్వారా రాజధానికి అవసరమైన నీటి వనరులు సమకూరుతాయని వివరించారు. కృష్ణా నదికి ఇరువైపులా అద్భుతమైన వాటర్ ఫ్రంట్ అభివృద్ధి చేసే అవకాశం ఉందని, నదిలో ఉన్న ఐల్యాండ్స్ను పర్యాటక కేంద్రాలుగా మార్చే అంశాన్ని కూడా పరిశీలించాలని సీఎం సూచించారు.ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, చీఫ్ సెక్రటరీ విజయానంద్తో పాటు పురపాలక, సీఆర్డీఏ, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.