వెలిగొండ రివర్స్ టెండరింగ్ గ్రాండ్ సక్సెస్.. మిగిలింది ఎంతో తెలుసా?
ఇప్పటికే పోలవరం హెడ్వర్క్స్, జలవిద్యుత్ కేంద్రం పనులకు రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.850 కోట్లు ప్రజాధనాన్ని ఆదా చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో
ఇప్పటికే పోలవరం హెడ్వర్క్స్, జలవిద్యుత్ కేంద్రం పనులకు రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.850 కోట్లు ప్రజాధనాన్ని ఆదా చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు వరప్రదాయిని అయిన వెలిగొండ ప్రాజెక్టులో కూడా రివర్స్ టెండరింగ్కు వెళ్లిన ఏపీ ప్రభుత్వం ఇందులో కూడా భారీ విజయం సాధించింది. వెలిగొండ ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 87 కోట్ల మేర ప్రజాధనాన్ని ఆదా చేసింది. 2017 లో బీజేపీ నేత, ఎంపీ సీఎం రమేష్కు చెందిన రిత్విక్ సంస్థ రూ. 597.35 కోట్లకు ప్రాజెక్టు రెండో టన్నెల్ పనులను దక్కించుకుంది. అయితే అప్పట్లో వెలిగొండ రెండో టన్నెల్ పనులను రిత్విక్ సంస్థ 4.69 శాతం అధిక ధరకు కోట్ చేశారన్న కారణంతో ఇందులో రివర్స్ టెండరింగ్ కు వెళ్ళింది జగన్ ప్రభుత్వం. రివర్స్ టెండరింగ్లో మేఘా సంస్థ రూ. 491.6 కోట్లకు బిడ్ దాఖలు చేసి ఎల్1గా నిలిచింది. రూ. 553.13 కోట్ల టెండర్ను 7 శాతం తక్కువకు దక్కించుకుంది. తద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 87 కోట్లకు పైగా మిగిలింది.
వాస్తవానికి వెలిగొండ రెండో సొరంగం పనులను 2006–07లో హెచ్సీసీ–సీపీపీఎల్ సంస్థ రూ.735.21 కోట్లకు దక్కించుకుంది. ఈ సొరంగం దూరం మొత్తం 18.8 కిలోమీటర్లు.. అయితే గడువు ప్రకారం 2020 మార్చి నాటికి సొరంగం పనులు పూర్తి చేయాల్సి ఉన్నా.. 2018 ఆగస్టు వరకు 10.750 కి.మీ.ల పనులు మాత్రమే పూర్తి చేసింది ఈ సంస్థ. అందుకు గాను రూ.489 కోట్లను చెల్లించింది ప్రభుత్వం. పనుల్లో వేగం పెంచని కారణంగా హెచ్సీసీ–సీపీపీఎల్పై గతేడాది 60 సీ కింద తప్పించింది అప్పటి ప్రభుత్వం. ఆ సమయంలో పనుల విలువను రూ.299.48 కోట్లుగా ఉందని చెప్పినా.. 2017–18 ధరల ప్రకారం ఆ పనుల విలువను రూ.720.26 కోట్లకు పెంచారు. అనంతరం రూ.570.58 కోట్ల అంచనాతో రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కు రూ.597.35 కోట్లకు ఈ పనులను అప్పజెప్పించింది. పనులు గడువులోగా పూర్తి చేసినట్టయితే రిత్విక్ ప్రాజెక్ట్స్కు అదనంగా 4.69 శాతం ఇస్తామని తెలుగుదేశం ప్రభుత్వం చెప్పింది. ఈ పనులకు రివర్స్ టెండర్ చేపట్టి జగన్ ప్రభుత్వం మరో సక్సెస్ ను సాధించింది. అయితే రిత్విక్ ప్రాజెక్ట్స్ దీనిపై అభ్యంతరాలు తెలిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
కాగా వెలిగొండ ప్రాజెక్టుకు నీటిని.. శ్రీశైలం డ్యాం ఎగువున నల్లమల అడవిలో "కొల్లం వాగు" కృష్ణా నదిలో కలిసేచోట నుంచి 43.5 TMCల వరద నీటిని 200 మీటర్ల అప్రోచ్ కాలువతో పారిస్తారు. అక్కడి నుంచి 18.8 కి.మీ పొడవున 2 సమాంతర సొరంగాల ద్వారా దోర్నాల కర్నూలు రహదారిలో "కొత్తూరు" వరకు నీటిని తరలిస్తారు. అక్కడ నుంచి సుమారు 22 కి.మీ పొడవైన కాలువ ద్వారా "నల్లమల సాగర్"లో నిలవ చేసి అక్కడి నుంచి వివిధ కాలువల ద్వారా రెండు కొండల శ్రేణిలో మధ్య సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల గ్యాప్ ప్రాజెక్టులకు నీటిని పంపిస్తారు.