Chicken Shops: రేపటి నుంచి చికెన్ దొరకడం కష్టమే.. యజమానుల సంచలన నిర్ణయం!

Chicken Shops: తెలంగాణలోని నాన్-వెజ్ ప్రియులకు ఏప్రిల్ 1వ తేదీ చేదు వార్తను మోసుకొచ్చింది.

Update: 2026-03-31 11:40 GMT

Chicken Shops: రేపటి నుంచి చికెన్ దొరకడం కష్టమే.. యజమానుల సంచలన నిర్ణయం!

Chicken Shops: తెలంగాణలోని నాన్-వెజ్ ప్రియులకు ఏప్రిల్ 1వ తేదీ చేదు వార్తను మోసుకొచ్చింది. చికెన్ షాపుల నిర్వహణ భారంగా మారిందని, తమకు వచ్చే లాభం (మార్జిన్) అస్సలు సరిపోవడం లేదని చికెన్ షాపుల యజమానుల అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. బుధవారం (ఏప్రిల్ 1) నుండి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ సెంటర్లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

గతంలో కిలో చికెన్‌పై రూ. 30 నుండి రూ. 35 వరకు లాభం మిగిలేదని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని ఖర్చులు పోను కేవలం రూ. 5 నుండి రూ. 6 మాత్రమే మిగులుతోందని వ్యాపారులు వాపోతున్నారు.

నిర్వహణ ఖర్చులు: షాపుల అద్దెలు, కరెంట్ బిల్లులు, పనివారి జీతాలు, మున్సిపాలిటీ నీటి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి.

కంపెనీల ఆధిపత్యం: లాభాలన్నీ పెద్ద పౌల్ట్రీ కంపెనీలకే వెళ్తున్నాయని, రిటైల్ వ్యాపారులను ఆదుకోవడానికి కంపెనీలు తమ మార్జిన్‌ను పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మార్జిన్ లెక్కలు ఇలా.. (ఒక అవగాహన):

సాధారణంగా ఒక కిలో బతికున్న కోడి ధర రూ. 120 ఉంటే, దానిని కట్ చేసిన తర్వాత వచ్చే మాంసం సుమారు 750 గ్రాములు మాత్రమే ఉంటుంది. అంటే కిలో మాంసం ధర అప్పటికప్పుడే రూ. 160కి చేరుతుంది. దీనిని కస్టమర్‌కు రూ. 200కి అమ్మినా.. షాపు రెంట్, కూలీలు, వేస్టేజ్, అమ్ముడుపోని స్టాక్ వంటివి లెక్కిస్తే తమకు నష్టాలే మిగులుతున్నాయని ఓనర్లు చెబుతున్నారు.

హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై ప్రభావం:

ఈ బంద్ ప్రభావం కేవలం ఇళ్లకే పరిమితం కాకుండా హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్డు పక్కన ఉండే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై కూడా తీవ్రంగా ఉండనుంది. చికెన్ అందుబాటులో లేకపోతే మటన్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నా, ఇప్పటికే మటన్ ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉన్నాయి. దీంతో నాన్-వెజ్ ప్రియుల పరిస్థితి 'అడకత్తెరలో పోకచెక్కలా' మారింది.

ఆర్థిక వ్యవస్థపై దెబ్బ:

ఒక్క హైదరాబాద్‌లోనే సుమారు 10,000 వరకు చికెన్ షాపులు ఉన్నాయి. ఈ రంగంపై వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు, షాపు యజమానుల మధ్య నెలకొన్న ఈ ధరల యుద్ధం త్వరగా ముగియకపోతే మార్కెట్ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని సామాన్యులు కోరుతున్నారు.

Tags:    

Similar News