రోహిత్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. మరోసారి ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రీఎంట్రీ..?

Rohit Sharma MI Leadership in IPL 2027: హార్దిక్‌ను ట్రేడ్‌ చేసే అంశంపై పలు జట్లతో చర్చలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. హార్దిక్‌ ముంబయిలోనే కొనసాగినా.. కెప్టెన్‌గా మాత్రం ఉండకపోవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

Update: 2026-09-01 14:54 GMT

రోహిత్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. మరోసారి ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రీఎంట్రీ..?

Rohit Sharma MI Leadership in IPL 2027: ఐపీఎల్‌ 2026లో ఘోర వైఫల్యం తర్వాత ముంబయి ఇండియన్స్‌ ప్రక్షాళనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబయి జట్టు వచ్చే సీజన్‌ కోసం నాయకత్వం, జట్టు నిర్వహణలో కీలక మార్పులపై దృష్టి సారించింది. ఈ క్రమంలో మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మను మరోసారి నాయకత్వ బృందంలోకి తీసుకురావాలని ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు సమాచారం.

కెప్టెన్సీ మాత్రం వద్దన్న రోహిత్‌?

ముంబయి ఇండియన్స్‌కు ఐదు ఐపీఎల్‌ టైటిళ్లు అందించిన రోహిత్‌ శర్మను తిరిగి కెప్టెన్‌గా నియమించే అంశంపై ఫ్రాంచైజీ చర్చించినట్లు సమాచారం. అయితే 39 ఏళ్ల రోహిత్‌ మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.

దీంతో వచ్చే సీజన్‌లో ముంబయి కెప్టెన్‌గా తిలక్‌ వర్మ లేదా జస్ప్రీత్‌ బుమ్రా పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరోవైపు రోహిత్‌ మాత్రం జట్టు భవిష్యత్‌ ప్రణాళికలు, నాయకత్వానికి సంబంధించిన చర్చల్లో కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది.

హార్దిక్‌ భవితవ్యంపై ఉత్కంఠ..

ఐపీఎల్‌ 2026లో ముంబయి ఇండియన్స్‌ ఆశించిన స్థాయిలో రాణించలేదు. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా భవితవ్యంపై కూడా అనిశ్చితి నెలకొంది.

హార్దిక్‌ను ట్రేడ్‌ చేసే అంశంపై పలు జట్లతో చర్చలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఒప్పందం ఖరారు కాలేదు. తాజా పరిణామాల ప్రకారం హార్దిక్‌ ముంబయిలోనే కొనసాగినా.. కెప్టెన్‌గా మాత్రం ఉండకపోవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

కోచ్‌గా మహేలానే కొనసాగింపు?

జట్టు నాయకత్వంలో మార్పులపై చర్చ జరుగుతున్నప్పటికీ.. కోచింగ్‌ విభాగంలో మాత్రం ముంబయి ఇండియన్స్‌ పెద్దగా మార్పులు చేయాలని భావించడం లేదట.

శ్రీలంక మాజీ కెప్టెన్‌ మహేల జయవర్ధనే వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లోనూ ప్రధాన కోచ్‌గా కొనసాగనున్నట్లు సమాచారం. ఆయన ఒప్పందంలో మరో ఏడాది పొడిగింపునకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన అక్టోబరులో వెలువడే అవకాశముంది.

రోహిత్‌-మహేల కాంబినేషన్‌ మళ్లీ!

ముంబయి ఇండియన్స్‌ విజయవంతమైన దశలో రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా, మహేల జయవర్ధనే కోచ్‌గా కీలక పాత్ర పోషించారు. ఈ ఇద్దరి కలయికలో ముంబయి అనేక విజయాలు సాధించింది.

ఇప్పుడు జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో మహేలాను కోచ్‌గా కొనసాగిస్తూ.. రోహిత్‌ అనుభవాన్ని జట్టు భవిష్యత్‌ ప్రణాళికలకు ఉపయోగించుకోవాలని ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు సమాచారం. యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలోనూ రోహిత్‌ అనుభవం ఉపయోగపడుతుందని ముంబయి యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అధికారిక ప్రకటన ఎప్పుడు?

రోహిత్‌ శర్మను మళ్లీ కెప్టెన్‌గా నియమించే అవకాశం లేదనే సంకేతాలే ప్రస్తుతం బలంగా ఉన్నాయి. అయితే నాయకత్వ బృందంలో ఆయన పాత్ర మాత్రం కీలకంగా ఉండొచ్చని సమాచారం. హార్దిక్‌ పాండ్యా భవితవ్యం, కొత్త కెప్టెన్‌ ఎంపిక, మహేల కొనసాగింపుపై తుది నిర్ణయాలు వెలువడాల్సి ఉంది.

మొత్తంగా.. ఐపీఎల్‌ 2027కు ముందు ముంబయి ఇండియన్స్‌లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోహిత్‌ శర్మ మళ్లీ జట్టు నాయకత్వ వ్యవస్థలోకి రావడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

Tags:    

Similar News