UTF Ranabheri 3.0: ఉపాధ్యాయ సమస్యలపై 'రణభేరి 3.0': ఆత్మకూరులో యూటీఎఫ్ భారీ నిరాహార దీక్ష!
UTF Ranabheri 3.0: కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోవడంలేదని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు వి.వి శేషులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆత్మకూరు: కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోవడంలేదని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు వి.వి శేషులు ఆవేదన వ్యక్తం చేశారు. పలు ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోరుతూ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి నిరాహార దీక్ష కార్యక్రమం రణభేరి 3.0 చేపట్టారు. యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం. గంగాధర్ గారి అధ్యక్షతన ఆత్మకూరు తహసిల్దార్ కార్యాలయం ఎదుట దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా పలువురు జిల్లా, డివిజన్,మండల స్థాయి నాయకులు సమస్యల గురించి వివరించారు. ఇందులో భాగంగా జిల్లా అధ్యక్షులు వివి శేషులు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 170 కు పైగా నియోజకవర్గాల్లో ఒకేరోజు నిరాహార దీక్షలు చేపట్టామన్నారు. పిఆర్సి కమిషన్ నియమించాలన్నారు. ఐఆర్.ను వెంటనే ప్రకటించాలని కోరారు. పాత డి ఎ బకాయిల తో పాటు ఆర్థిక బకాయిలన్నింటినీ వెంటనే చెల్లించాలన్నారు. ఓపిఎస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కరోనా సమయంలో మృతి చెందిన 953 మంది ఉపాధ్యాయులకు కారుణ్య నియామకాలు ఇవ్వాలన్నారు. ఏప్రిల్, ఒకటి రెండు తేదీల్లో నెల్లూరు జిల్లా కేంద్రంలో నిరాహార దీక్షలు అనంతరం ఏప్రిల్ 15 నుంచి 19 వరకు ఐదు రోజులపాటు రాష్ట్ర కేంద్రంలో దీక్షలు చేపట్టి 28వ తేదీ చలో అమరావతి కార్యక్రమాన్ని చేపడతామన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శులు ఎం.గంగాధర్, షేక్. నాయబ్ రసూల్, ఎన్.రమణయ్య, రాష్ట్ర కౌన్సిలర్ వి. మల్లికార్జున, ఎఫ్డబ్ల్యూఎఫ్ డైరెక్టర్ యు. తిరుపాలు, ఆత్మకూరు నియోజకవర్గం లోని ఆత్మకూరు, అనంతసాగరం,ఏఎస్.పేట,మర్రిపాడు, సంగం,చేజర్ల మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆత్మకూరు సిఐటియు, ఎల్ఐసి, విద్యుత్ రంగ సంఘం నాయకులు నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతును తెలియజేశారు.