To which side family yields: పార్టీల పోటాపోటీ..మరి పీవీ ఫ్యామిలీ ఎటు?

Update: 2020-07-27 12:26 GMT

 to which side family yields: ఆయన కోసం అన్ని పార్టీలు పోటీపడుతున్నాయి. ఆయనను తమవాడిగా చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. మొన్నటివరకు సొంత పార్టీనే పరాయి నాయకుడిగా అవమానించింది. కానీ ఇప్పుడు ఇతర పార్టీలు అక్కున చేర్చుకుంటూ గౌరవించుకుంటున్నాయి. మరి ఆయన కుటుంబ సభ్యులు ఏ పార్టీకి మద్దతిస్తారు? పోటాపోటీగా పార్టీలు నివాళులు అర్పిస్తుంటే, ఫ్యామిలీ ఎటువైపు?

భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశాదశా చూపిన దార్శనికుడు మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నర్సింహారావు. ఆర్థిక సంస్కరణలు, భూసంస్కరణలతో భారతదేశ ముఖచిత్రాన్నే మార్చేసిన పాలనాదక్షుడు. అప్పుడు పీవీ నాటిన చెట్లే, ఇప్పుడు ఫలాలు అందిస్తున్నాయి దేశానికి. అయితే, సొంత పార్టీ కాంగ్రెస్‌ మాత్రం, ఈ రాజకీయ భీష్మాచారున్ని మరచింది. చివరి మజిలీలోనూ అవమానకరంగా వ్యవహరించింది. అయితే, ఇప్పుడు వీవీని ఓన్ చేసుకునేందుకు, అన్ని ప్రధాన పొలిటికల్ పార్టీలు పోటీపడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో పీవీ ఫ్యామిలీ ఎవరికి మద్దతుగా వుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

భారతీయ జనతా పార్టీ పీవీని మొదటి నుంచి ఘనంగానే స్మరిస్తోంది. 2015లోనే ఢిల్లీలో పీవీ ఘాట్‌కు స్థలం కేటాయించింది మోడీ ప్రభుత్వం. ఆయన పాలన సమయం, దేశానికి విప్లవాత్మకమని ఎప్పటికప్పుడు కొనియాడుతోంది కూడా. శత జయంత్యుత్సవాల సందర్భంగానూ నివాళులు అర్పించారు కాషాయ నేతలు. ఇటు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం కూడా, పీవీని గుండెలకు హత్తుకుంది. తెలంగాణ బిడ్డ, దేశానికి ముద్దుబిడ్డ అంటూ, ప్రపంచ నలుచెరుగులా శత జయంత్యుత్సవాలను జరుపుతోంది. కరోనా టైంలోనూ అన్ని పార్టీలనూ ఆహ్వానించి, హైదరాబాద్‌ పీవీ ఘాట్‌లో ఘనంగా ఉత్సవాలను ప్రారంభించింది. సీఎం కేసీఆర్‌,‌ ఆయన కీర్తిని కొనియాడారు.

ఇలా బీజేపీ, టీఆర్‌ఎస్‌లు పీవీని సొంతం చేసుకునేందుకు చాతుర్యం ప్రదర్శిస్తుంటే, ఎక్కడ తమకది మైనస్‌‌గా మారుతుందోనని జాగ్రత్తపడుతున్నట్టు కనిపిస్తోంది తెలంగాణ కాంగ్రెస్. ఢిల్లీలో సోనియా, రాహుల్‌లు పీవీని స్మరించకపోయినా, రాష్ట్రంలో ఏదో హడావుడి చెయ్యడం ప్రారంభించారు. చరమాంకంలో పీవీని కాంగ్రెస్‌ ఎలా అవమానించిందో దేశం మర్చిపోదు. తెలుగు ప్రజలు అస్సలు మర్చిపోరు. అయితే, బీజేపీ, టీఆర్ఎస్‌లు పీవీని కాంగ్రెస్‌ నుంచి దూరం చేస్తాయోనని ఆత్మరక్షణలో పడింది ఖద్దరు పార్టీ. బీజేపీ సర్దార్ పటేల్‌ను ఎలా ఓన్ చేసుకుందో, అలాగే టీఆర్‌ఎస్‌ కూడా పీవీని సొంతం చేసుకుంటుందోనన్న ఆత్రం తప్ప, కాంగ్రెస్‌ కార్యక్రమాల్లో నిజాయితీ కనిపించడం లేదు. ఆత్మశుద్దిలేని పూజలేల అన్నట్టుగా, కాంగ్రెస్ నేతల పీవీ స్మరణలో యదార్థత కనిపించడం లేదు.

పీవీ శత జయంత్యుత్సవాలను తాము ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పుకునేందుకు తాజాగా, రాష్ట్ర, కేంద్ర నాయకత్వం రంగంలోకి దిగింది. వర్చువల్‌ మీటింగ్‌లో నివాళులు అర్పించింది. ఆయన కీర్తిని వేనోళ్ల పొగిడింది. మరి ఇప్పుడే కాంగ్రెస్‌ జాతీయ నాయకులకు పీవీ గుర్తొచ్చారా? నాడు కనీసం పార్టీ ఆఫీసులోకి కూడా మృతదేహాన్ని తేవొద్దని సోనియా ఆదేశించినప్పుడు, వీరంతా ఏం చేశారు? పదేళ్లు అధికారంలో వుండి కూడా ఆయన స్మరకాన్ని ఎందుకు ఏర్పాటు చెయ్యలేదు? పీవీకి నివాళులు అర్పిస్తూ, సోనియా ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు బీజేపీ, టీఆర్ఎస్‌లు ముందుకొస్తుంటే, స్మరణకు వచ్చారా అని ప్రశ్నిస్తున్నారు పీవీ కుటుంబ సభ‌్యులు.

ఇలా పార్టీలు పీవీని ఓన్ చేసుకునేందుకు పోటీ పడుతుండటంతో, కుటుంబ సభ్యుల మద్దతు ఎవరికన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే పీవీ మనవడు ఎన్వీ సుభాష్ బీజేపీలో వున్నారు. అయితే, పీవీ ఫ్యామిలీలోని కొందరు త్వరలో గులాబీ తీర్థం పుచ్చుకుంటారన్న మాటలు వినిపిస్తున్నాయి. పీవీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి టీఆర్ఎస్‌, ఎమ్మెల్సీ ఇస్తుందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చూడాలి, పీవీ ఘనకీర్తిని స్మరిస్తున్న పార్టీల్లో, ఏ పార్టీకి పీవీ కుటుంబ సభ్యులు జైకొడతారో.

Full View


Tags:    

Similar News