కొన్ని రోజుల క్రితం మాటీవీలో జానపద పాటలతో దుమ్మురేపిన షో రేలారే...రేలా గుర్తుందా.. ఆ షోలో తనదైన శైలిలో అచ్చమైన పల్లె పాటలను పాడి ఇటు ప్రేక్షకులను, అటు న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్న రషీద్ గుర్తున్నాడా.. ఇప్పుడు అతని గురించి ఎందుకు అనుకుంటున్నారా. ఏం లేదండీ ఇటు గాయకుడుగా సక్సెస్ సాధించిన అతను రియల్ లైఫ్ లో కూడా సక్సె్స్ సాధించాడు. అది ఏంటంటారా అయితే ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం..
నిజామాబాద్ జిల్లా నడపల్లి గ్రామపంచాయతి పరిధిలోని గాంధీనగర్ కాలనీకి చెందిన రషీద్, వరంగల్ అర్బన్ జిల్లా ఫాతిమానగర్కు చెందిన సమీరా ఇద్దరూ హైదరాబాద్ బేగంపేట్ దేవనర్ ఫౌండేషన్లో చదువుకున్నారు. ఈ ఇద్దరూ అంధులే కావడం, అందులోనూ ఇద్దరూ గాయకులే కావడం ఇద్దరినీ స్నేహం వైపునకు నడిపింది.
ఇలా కొన్ని గడిచిన తరువాత రషీద్ కు టీవీషోలో ఆఫర్ రావడంతో అతను తాత్కాలికంగా చదువు మానేసి టీవీ షోలతో బిజీగా మారిపోయాడు. తరువాత మళ్లి చదువును కొనసాగించడానికి మూడేళ్ల క్రితం డిగ్రీలో చేరాడు. సమీరా కూడా అక్కడే చదువును కొనసాగిస్తూ ఉండడంతో మళ్లీ ఇద్దరూ కలిసారు. ఇద్దరు గాయకులు కావడంతో వారి చిన్ననాటి పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది.
ఇక వీరి ప్రేమ విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకుని ఆదివారం డిచ్పల్లి మండలం ఘన్పూర్లోని షాదీఖానాలో పెళ్లి జరిపించారు.
ఈ పెళ్లిలో ట్విస్ట్ ఏటంటే రషీద్ ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న సమీర గిరిజన కుటుంబానికి చెందింది. దీప (సమీర) తల్లిదండ్రులు రాజేశ్వరి, రామదాస్ మరణించడంతో తాత కోక్యా, నానమ్మ పుల్లమ్మ వద్ద పెరిగింది. తల్లిదండ్రులు లేకపోవడంతో తాత, నానమ్మలు దీప పెళ్లికి అంగీకరించారు. ఇక దీప రషీద్తో పెళ్లి కోసం దీప తన పేరును సమీరాగా మార్చుకుంది.
కట్న కానుకలు తీసుకోకుండా మతాంతర వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచిన రషీద్, సమీరా జంటను బంధువులు, కుటుంబీకులతో పాటు ఇరువర్గాల పెద్దలు, మండల ప్రజలు అభినందించి ఆశీర్వదించారు.