Peddapalli: ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు.. విజయరమణ రావు
Peddapalli: పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు ఎలిగేడు మండలంలో పర్యటించి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు.
Peddapalli: ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు.. విజయరమణ రావు
Peddapalli: కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ప్రజా సంక్షేమమేనని, పేదల ముఖాల్లో ఆనందం చూడటమే ధ్యేయమని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. ఎలిగేడు మండలం బురహన్మియపేట, నర్సాపూర్ గ్రామాల్లో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా ఆయన పర్యటించారు. లబ్ధిదారులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి, గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో పేదలకు ఇళ్లు ఇవ్వకుండా అన్యాయం చేసిందని మండిపడ్డారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు. మొదటి విడత ఇళ్లు పూర్తి కావస్తున్నాయని, త్వరలోనే అర్హులైన మిగతా వారందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రైతు బీమా తరహాలోనే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి బీమా సౌకర్యం కల్పించే పథకాన్ని జూన్ 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని వెల్లడించారు.
రైతులు కేవలం వరికే పరిమితం కాకుండా, ఆయిల్ ఫామ్ మరియు ఇతర కూరగాయల సాగు ద్వారా పంట మార్పిడి చేసి అధిక లాభాలు గడించాలని కోరారు. ఈ పర్యటనలో బురహన్మియపేటలో రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించారు. కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.