కామన్ రిక్రూట్‎మెంట్ బోర్డుపై పంతం నెగ్గించుకున్న గవర్నర్

Governor Tamilisai Soundararajan: కామన్ బోర్డు రిక్రూట్‎మెంట్‎పై గవర్నర్ తమిళిసై లేవనెత్తిన సందేహాలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరణ ఇచ్చారు.

Update: 2022-11-11 08:25 GMT

కామన్ రిక్రూట్‎మెంట్ బోర్డుపై పంతం నెగ్గించుకున్న గవర్నర్

Governor Tamilisai Soundararajan: కామన్ బోర్డు రిక్రూట్‎మెంట్‎పై గవర్నర్ తమిళిసై లేవనెత్తిన సందేహాలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరణ ఇచ్చారు. విద్యాశాఖ అధికారులతో కలిసి రాజ్‎భవన్ వెళ్లిన సబిత.. గవర్నర్‎తో సమావేశమయ్యారు. బోర్డు ద్వారా తలెత్తే ఇబ్బందులు, న్యాయ పరమైన చిక్కులు , రిజర్వేషన్లు, యూజీసీ నిబంధనల అమలుపై వివరాలను గవర్నర్ అడిగి తెలుసుకున్నారు . తమిళిసై అడిగిన ప్రశ్నలకు మంత్రి, అధికారులు సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం తరపున వినిపించిన వాదనలకు గవర్నర్ సానుకూలంగా స్పందించి.. బిల్లుకు ఆమోదం తెలుపుతారా..? లేదా..? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఉప్పునిప్పులా మారిన రాజ్‎భవన్ వర్సెస్ ప్రగతిభవన్ ఇష్యూలో గవర్నర్ తమిళిసై తన పంతం నెగ్గించుకున్నారు. పలు బిల్లులకు ఆమోదం తెలపని గవర్నర్ తనకు వాటిపై సందేహాలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తం చేశారు. కామన్ రిక్రూట్‎మెంట్ బోర్డు ద్వారా నియామకాలపై అనుమానాలు నివృత్తి చేయాలని విద్యాశాఖను ఆదేశించారు. ఆ తర్వాత గవర్నర్ ప్రెస్‎మీట్‎తో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. చివరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నతాధికారులతో కలిసి రాజ్‎భవన్ మెట్లెక్కారు. దాదాపు గంట పాటు జరిగిన భేటీ లో కామన్ రిక్రూట్‎మెంట్ బోర్డు ద్వారా చేపట్టబోయే నియామకాలపై గవర్నర్ సందేహాలకు బదులిచ్చారు. సమావేశం జరిగినంత సేపు రాజ్‎భవన్ సిబ్బంది వీడియో రికార్డ్ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వ విద్యాలయాల్లో నెలకొన్న పరిస్థితులపై ప్రభుత్వం ఎందుకు చొరవ చూపడం లేదో చెప్పాలని విద్యాశాఖ మంత్రిని గవర్నర్ వివరణ కోరారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనగుణంగా, నిరుద్యోగ యువతకు భరోసా ఇచ్చే విధంగా రిక్రూట్‎మెంట్ పారదర్శకంగా ఉండాలన్నదే తమ అభిప్రాయమని తమిళిసై చెప్పినట్లు సమాచారం. బోర్డు ద్వారా రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో పూర్తి పారదర్శకత అవసరమని గవర్నర్ సూచించారు. నిష్పాక్షిక పద్ధతిలో వీలైనంత త్వరగా రిక్రూట్‌మెంట్‌ను చేపట్టాలని విద్యాశాఖ మంత్రికి గవర్నర్ స్పష్టం చేశారు. అర్హత ఆధారిత రిక్రూట్‌మెంట్‌ను నిర్వహించాలన్నారు. ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి UGC నిబంధనలను కచ్చితంగా పాటించాలని మంత్రి సబితను గవర్నర్ ఆదేశించారు.

నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళనలు చేయకుండా వీలైనంత త్వరగా సమస్య పరిష్కరానికి కృషి చేయాలని గవర్నర్ సూచించారు. ఉమ్మడి రిక్రూట్‌మెంట్ బోర్డుకు సంబంధించిన సమస్యలతో పాటు, హాస్టల్, లేబొరేటరీ సౌకర్యాలను మెరుగుపరచడంపైనా ప్రత్యేకంగా దృష్టి సారించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని తమిళిసై విద్యాశాఖ ఉన్నతాధికారులకు సూచించారు. విశ్వవిద్యాలయాలలో లైబ్రరీ సౌకర్యం, డిజిటల్ వనరులు మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. యూజీసీ నిబంధనల మేరకు ప్రభుత్వం ఇచ్చిన వివరణను మరోసారి గవర్నర్ పరిశీలించే అవకాశం ఉంది. అయితే వెంటనే ఈ బిల్లుకు అనుకూలంగా గవర్నర్ నిర్ణయం తీసుకుంటారా..? లేదా..? అన్నది వేచిచూడాలి.

Full View


Tags:    

Similar News