మున్సిపల్ పోరుపై రేవంత్ 'జూమ్' అస్త్రం: గెలుపే లక్ష్యంగా మంత్రులకు దిశానిర్దేశం.. ఓటర్ల వద్దకే నేతలు వెళ్లాలని ఆదేశం!

Update: 2026-02-09 08:41 GMT

Telangana Municipal Elections: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ మంత్రులు, ముఖ్య నేతలతో కీలకమైన జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో, పోల్ మేనేజ్‌మెంట్‌పై నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు.

నియోజకవర్గాల వారీగా సమీక్ష.. గెలుపే లక్ష్యం!

ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా పలువురు డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. పార్టీ ఎక్కడైతే కాస్త బలహీనంగా ఉందో, ఆ మున్సిపాలిటీల్లో ప్రత్యేక పోలింగ్ వ్యూహాన్ని అమలు చేయాలని సీఎం ఆదేశించారు.  "ప్రతి ఓటరూ పోలింగ్ కేంద్రానికి వచ్చేలా చూడాలి. ఓటింగ్ శాతం పెరిగితేనే మనకు విజయావకాశాలు మెరుగుపడతాయి" అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

నేతలకు డెడ్ లైన్.. ప్రజల మధ్యే ఉండండి!

ఎన్నికల నేపథ్యంలో మంత్రులు, స్థానిక నేతలకు సీఎం కఠిన ఆదేశాలు జారీ చేశారు. స్థానిక నేతల నేతృత్వంలోనే పోల్ మేనేజ్‌మెంట్ సజావుగా సాగాలని, మంత్రులు పర్యవేక్షించాలని సూచించారు. ఇవాళ, రేపు (పోలింగ్ ముగిసే వరకు) నేతలు ఓటర్లకు నిరంతరం అందుబాటులో ఉండాలని, ఎటువంటి సమన్వయ లోపం ఉండకూడదని హెచ్చరించారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్టీ స్థితిగతులపై ఆరా తీసిన సీఎం, మెజారిటీ మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News