Medicine Alert : మీ ఫోన్‌కు మెసేజ్ వచ్చిందా? అయితే ఆ మందులను వెంటనే పక్కన పడేయాల్సిందే

Medicine Alert : నాణ్యత లేని మందుల అమ్మకాలను అడ్డుకునేందుకు తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ బల్క్ SMS అలర్ట్ సిస్టమ్‌ను ప్రారంభించింది. మెడికల్ షాపులకు తక్షణ హెచ్చరికలు పంపి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే దీని ప్రధాన లక్ష్యం.

Update: 2026-03-10 01:54 GMT

Medicine Alert : తెలంగాణలో ఇకపై నాసిరకం మందుల ఆటలు సాగవు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే నాణ్యత లేని ఔషధాల విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) రంగంలోకి దిగింది. సోమవారం (మార్చి 9, 2026) నాడు ఒక విప్లవాత్మకమైన బల్క్ SMS అలర్ట్ సిస్టమ్‎ను ప్రారంభించింది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేల సంఖ్యలో మెడికల్ షాపులు, తయారీదారులకు నిమిషాల వ్యవధిలోనే సమాచారం చేరిపోనుంది. డిజిటల్ టెక్నాలజీని వాడుకుని ఔషధ రంగంలో భద్రతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

సాధారణంగా ఏదైనా మందు నాణ్యత లేనిదని తేలితే, ఆ సమాచారం వెబ్‌సైట్లలో పెట్టడానికో లేదా సర్క్యులర్ల రూపంలో పంపడానికో దాదాపు 15 నుంచి 20 రోజుల సమయం పట్టేది. ఈ గ్యాప్‌లో ఆ నాసిరకం మందులు ప్రజల చేతుల్లోకి వెళ్లి వారి ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉండేది. కానీ కొత్తగా వచ్చిన ఈ SMS వ్యవస్థ ద్వారా, ఒక మందులో లోపం ఉందని తెలియగానే తక్షణమే రాష్ట్రంలోని 48,000 మెడికల్ షాపులు, 760 మంది తయారీదారులు, డిస్ట్రిబ్యూటర్ల మొబైల్ ఫోన్లకు ఒకేసారి మెసేజ్ వెళ్లిపోతుంది.

మెసేజ్ అందిన వెంటనే సదరు మందుల విక్రయాలను నిలిపివేయాలని డీసీఏ డైరెక్టర్ జనరల్ షహ్నవాజ్‌ఖాన్ ఖరాఖండిగా ఆదేశించారు. "ఒకసారి అలర్ట్ మెసేజ్ వచ్చాక కూడా ఆ మందులను అమ్మితే అస్సలు సహించం. అటువంటి వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా, లైసెన్సులు కూడా రద్దు చేస్తాం" అని ఆయన హెచ్చరించారు. ప్రజల ఆరోగ్య రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రియల్ టైమ్ ట్రాకింగ్ ద్వారా అనర్హమైన మందులను అడ్డుకోవచ్చని ఆరోగ్య నిపుణులు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.

ప్రస్తుతం తెలంగాణ డీసీఏ వద్ద ఏడాదికి 5 నుంచి 6 వేల మందుల శాంపిళ్లను పరీక్షించే సామర్థ్యం ఉన్న ఒకే ఒక ల్యాబ్ ఉంది. అయితే దీనిని 12 వేలకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో కొత్తగా టెస్టింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసేందుకు, అదనపు ఇన్‌స్పెక్టర్లను నియమించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ కొత్త ల్యాబ్‌లు అందుబాటులోకి వస్తే మందుల నాణ్యత పరీక్షలు మరింత వేగంగా, పకడ్బందీగా సాగుతాయి.

Tags:    

Similar News