TS Budget: తొలి పద్దుకు సిద్ధం అవుతున్న రేవంత్ సర్కార్
TS Budget: శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలపై రివ్యూకు సిద్ధమైన ప్రభుత్వం
Telangana: తొలి పద్దుకు సిద్ధం అవుతున్న రేవంత్ సర్కార్
TS Budget: కాంగ్రెస్ అధికారం చేపట్టాక తెలంగాణలో తొలి పద్దు పొడవబోతోంది. 2024- 25 ఆర్థిక సంవత్సరం కోసం పూర్తిస్తాయి బడ్జెట్కు సిద్ధం అవుతోంది రేవంత్ సర్కార్. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరేలా బడ్జెట్ రూపకల్పన ఉండేలా చూసుకుంటోంది. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు అధిక ప్రాధాన్యత ఇచ్చి బడ్జెట్ను వండివార్చబోతోంది. గొప్పలకు పోకుండా.. వాస్తవిక అంచనాలకు దగ్గర ఉండేలా బడ్జెట్ను రూపొందించబోతోంది.
అందుకోసం శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలపై రివ్యూ చేసేందుకు సిద్ధం అవుతోంది తెలంగాణ ప్రభుత్వం. గత ప్రభుత్వం చేసిన ఖర్చులేన్నీ ఈ ఏడాది ఎంత బడ్జెట్ ప్రతిపాదిస్తున్నారో పూర్తి వివరాలతో రావాలని ఆయా శాఖలకు ఆదేశించింది. సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుని శాఖల వారీగా బడ్జెట్లో నిధులను కేటాయించనుంది ప్రభుత్వం.
తెలంగాణలో 2014 నుంచి 2023 వరకు గత ప్రభుత్వం ఏఏ శాఖలకు ఎంత మేరకు నిధులు కేటాయించింది, కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేశాయా లేదా అన్న అంశాలను స్పష్టంగా తెలియజేసేలా బడ్జెట్ రూపకల్పన ఉండాలంటూ అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. అదే విధంగా శాఖల వారిగా 6 గ్యారంటీలను పరిగణలోకి తీసుకొని నిధుల కేటాయింపు ఉండేలా సిద్ధం చేయాలని ఆదేశించింది. ఏ రాష్ట్రం అయినా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ను అనుసరిస్తూ పద్దును తయారు చేసుకుంటుంది.
అయితే ఈసారి కేంద్ర ప్రభుత్వం లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతునట్లు తెలుస్తోంది. రేవంత్ సర్కార్ కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడితే 6 గ్యారంటీల అమలుకు చిక్కులు ఏర్పడే ప్రమాదం ఉందన్న చర్చ జరుగుతుంది..అందుకే పూర్తిస్థాయి బడ్జెట్ కే రాష్ట్ర ప్రభుత్వం మోగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. వచ్చే వారంలో బడ్జెట్ ప్రతిపాదనలపై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస రివ్యూలు చేసే అవకాశం కనిపిస్తుంది.
బడ్జెట్ ప్రతిపాదనలు ఏ రకంగా ఉండాలో ఫైనాన్స్ శాఖ నుంచి అన్ని శాఖలకు దాదాపు 50 పేజీలకు పైగానే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పంపినట్లు సమాచారం. ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకొని 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రతిపాదనలతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాలను పంపాలని సూచించారట.
బడ్జెట్ ప్రతిపాదనలు పంపే క్రమంలో వాస్తవిక అంచనాలు ఉండాలి తప్ప గొప్పలకు పోయి భారీ అంచనాలను పంపొద్దని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి అధికారులకు చెప్పారట. గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఖర్చును తగ్గించి, అన్ని విభాగాల ఖర్చులను ఒక్క శాఖ కిందనే పంపాలని తెలిపారట.