Cold Wave: తెలుగురాష్ట్రాల్లో పంజా విసురుతోన్న చలి.. ముఖ్యంగా ఆదిలాబాద్‌ వాసులను వణికిస్తోన్న చలి

Cold Wave: తెలుగురాష్ట్రాల్లో చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఉదయం, రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతున్నాయి.

Update: 2025-12-08 05:40 GMT

Cold Wave: తెలుగురాష్ట్రాల్లో పంజా విసురుతోన్న చలి.. ముఖ్యంగా ఆదిలాబాద్‌ వాసులను వణికిస్తోన్న చలి 

Cold Wave: తెలుగురాష్ట్రాల్లో చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఉదయం, రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతున్నాయి. రోజురోజుకూ పరిస్థితి మరింత చల్లగా మారుతోంది. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు రాబోయే మూడ్రోజుల్లో తెలంగాణలో మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సాధారణం కంటే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

ఇక ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుతం పెరుగుతున్న చలితీవ్రతో కశ్మీర్‌ను తలపిస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆదిలాబాద్ జిల్లాపై శీతాకాలం పగబట్టిందా అన్నట్లుగా ఇక్కడి వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. తెల్లారింది మొదలు సాయంత్రం వరకు చలిపైనే చర్చసాగుతోంది. గడిచిన నాలుగు రోజులుగా 8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, ప్రజలు గజగజ వణికిపోతున్నారు. చలి ప్రభావం ఇటు మూగ జీవాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. తాంసీ, భీంపూర్, తలమడుగు, జైనథ్ మండలాలతో పాటు బోథ్, ఇచ్చోడ, నేరేడిగొండ, బజార్హత్నూరు, ఉట్నూరు మండలాల్లో ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో గ్రామీణ ప్రాంతాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాల్లో చలితీవ్రతతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే చలితో వ్యవసాయానికి ఆయువుపట్టైన మూగజీవాలు చలితో విలవిలలాడుతున్నాయి. ఓ పక్క గ్రాసం కొరత, మరోపక్క చలితో మూగజీవాలు సైతం బేజారవుతున్నాయి.

తీవ్ర చలిగాలులతో వయసు మళ్లిన పశువులు చలిగాలులతో ఇబ్బందులు పడుతున్నాయని రైతులు చెబుతున్నారు. గడిచిన మూడు రోజుల్లో 4 పశువులు చలితో మృత్యువాత పడ్డాయి. పశువులకు సంబంధించిన రైతులు మూగజీవాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పశువుల పాకలో కొంత వెచ్చగా ఉండే ప్రదేశాల్లో వాటిని ఉంచాలని, ప్రతి నాలుగు గంటలకు ఒకసారి గ్రాసం అందించాలని పశువైద్యాధికారులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News