Karimnagar: పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు
కరీంనగర్ జిల్లాలో పదో తరగతి పరీక్షా కేంద్రాలను కలెక్టర్ చిత్రా మిశ్రా తనిఖీ చేశారు. విద్యార్థులకు తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
Karimnagar: పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు
కరీంనగర్/బ్యూరో: కరీంనగర్ సప్తగిరి కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తిరుమల నగర్ లోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా సోమవారం నిర్వహిస్తున్న ఇంగ్లీష్ పరీక్షల సరళిని పరిశీలించారు. విధులు నిర్వర్తిస్తున్న అధికారులు సిబ్బందితో మాట్లాడారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన తాగునీరు, ప్రథమ చికిత్స, మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు.
తరగతి గదిలో తగిన వెంటిలేషన్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడా ఎలాంటి చిన్న తప్పిదానికి అవకాశం ఇవ్వకుండా విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ అంతరాయం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
అడిషనల్ కలెక్టర్ తనిఖీ..
హౌసింగ్ బోర్డు కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల(కుమర్వాడి), సుభాష్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే తనిఖీ చేశారు. విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు తగిన సూచనలు చేశారు. పదవ తరగతి పరీక్షలు పక్కాగా నిర్వహించాలని, ఎక్కడా తప్పులు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.
పరీక్షా కేంద్రాల్లో వసతులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.