భద్రాద్రి రామయ్యకు కోటి తలంబ్రాల కోసం ఏకంగా రామదండే వరి చేలో దిగి కోతమొదలు పెట్టిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో చోటుచేసుకుంది. ఏటా భద్రాద్రి రాముని కల్యాణోత్సవానికి గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను సమర్పించడం శ్రీకృష్ణచైతన్య సంఘం ప్రెసిడెంట్ కళ్యాణం అప్పారావుకు ఆనవాయతీ. అందుకు అవసరమైన ధాన్యాన్ని గోకవరం మండలం అచ్చుతాపురంలోని తన పొలంలో సాగుచేసి.. స్వామివారికి సమర్పిస్తుంటారు.
కోతకు వచ్చిన పంటను కోసేందుకు కూలీలకు రాముడి హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగదుడు వంటి వేషాలు వేయించి, శ్రీరామ నామాన్ని జపిస్తూ పైరును కోయించారు. అనంతరం ఆ వేషధారులు పైరును బల్లకేసి కొట్టి, నూర్పిడి పూర్తి చేశారు. అనంతరం శ్రీరామ భక్తులకు ధాన్యం అందజేసి.. గోటితో ఒలిపించి.. లెక్కించి కోటి తలంబ్రాలను భద్రాద్రి రామయ్యతో పాటు ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కల్యాణానికి పంపనున్నారు.