హైదరాబాద్లో పిల్లలను అమ్ముతున్న ముఠా అరెస్ట్... నిందితులకు గుజరాత్లో లింక్స్
Child trafficking in Hyderabad: గుజరాత్ నుండి పిల్లలను హైదరాబాద్ తీసుకొచ్చి అమ్ముతున్న చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా.
హైదరాబాద్లో పిల్లలను అమ్ముతున్న ముఠా అరెస్ట్... గుజరాత్ నుండి తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్మకం
Child trafficking in Hyderabad: రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసులు చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు బయటపెట్టారు. గుజరాత్లో అప్పుడే పుట్టిన నలుగురు పిల్లలను ఒక ముఠా హైదరాబాద్ తీసుకొచ్చి అమ్ముతుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఆడ శిశువును రూ. 2.5 లక్షలకు విక్రయిస్తున్నారు. మగ శిశువును రూ. 4.5 లక్షలకు అమ్ముతున్నారు. ఈ చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా గురించి స్పష్టమైన సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు, చైతన్యపురి పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి ఈ ముఠాను పట్టుకున్నారు.
చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాకు సంబంధించి రాచకొండ పోలీసులు మొత్తం 11 మందిని అరెస్ట్ చేశారు. పిల్లలను కొనుగోలు చేసిన దంపతులపై కూడా కేసులు నమోదు చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ జి సుధీర్ బాబు మీడియాకు చెప్పారు.
గుజరాత్ నుండి పిల్లలను హైదరాబాద్ తీసుకొచ్చి అమ్ముతున్న చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా అక్కడ ఏ పద్ధతిలో ఈ పిల్లలను తీసుకొచ్చారనేది దర్యాప్తులో తెలుస్తుందని సీపీ సుధీర్ బాబు తెలిపారు. గుజరాత్ లో ఈ పిల్లలను నిందితులే స్వయంగా కిడ్నాప్ చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చారా లేక అక్కడ ఎవరి నుండి అయినా కొనుగోలు చేసి తీసుకొచ్చారా అనేది తేలాల్సి ఉంది. ఈ వివరాలు తెలుసుకునేందుకు త్వరలోనే ఒక ప్రత్యేక బృందాన్ని గుజరాత్ పంపించనున్నట్లు సీపీ చెప్పారు.