Nizamabad: బోధన్ మండలంలో విషాదం: బిల్ కలెక్టర్ ఆత్మహత్య.. అధికారుల వేధింపులే కారణమా?
Nizamabad: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెంట ఖుర్దు గ్రామ పంచాయతీలో బిల్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న గైని బాబు (45) ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Nizamabad: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెంట ఖుర్డు గ్రామ పంచాయతీలో బిల్ కలెక్టర్గా పనిచేస్తున్న గైని బాబు (45) ఆత్మహత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అధికారుల వేధింపులతో పాటు, నిధుల దుర్వినియోగాన్ని తనపై నెట్టడం వల్లే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రెండు రోజుల క్రితం పురుగుల మందు సేవించిన బాబును నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూశారు. బాబు మరణంతో ఆయన కుటుంబం రోడ్డున పడింది. మృతుడికి ముగ్గురు సంతానం ఉండగా, ఇద్దరు ఆడపిల్లలు వికలాంగులు కావడం ఆ కుటుంబాన్ని మరింత విషాదంలో ముంచెత్తింది.
బాబు ఆత్మహత్యకు సంబంధించి స్థానికులు మరియు కుటుంబ సభ్యులు సంచలన విషయాలను వెల్లడించారు. పంచాయతీ పన్నుల వసూలు చేసి ఓ అధికారికి అందజేసినప్పటికీ, సదరు అధికారి తనకు డబ్బు అందలేదని బుకాయించడమే కాకుండా.. బాబును మానసిక వేధింపులకు గురిచేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
గతంలో పనిచేసిన ఒక అధికారితో కలిసి పంచాయతీ సిబ్బంది సుమారు రూ. 5 లక్షల నిధులను దుర్వినియోగం చేశారని, ఆ నెపాన్ని బాబుపై నెట్టి వేయడానికి ప్రయత్నించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కుట్రతో తీవ్ర మనస్తాపానికి గురైన బాబు, తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
బోధన్ రూరల్ పోలీసులు ఆసుపత్రికి చేరుకుని మృతదేహానికి శవపంచనామా నిర్వహించారు. బాబు మృతికి కారకులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిధుల దుర్వినియోగం మరియు వేధింపుల కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు.