Liquor: మందుబాబులకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న మద్యం ధరలు..ఫిబ్రవరి 1నుంచే అమలు?
Liquor: తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్ తగలనుంది. గత నాలుగేళ్లుగా ఎలాంటి మద్యం ధరల పెంపు లేనందున ధరలు స్థిరంగానే ఉన్నాయి. కానీ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలు భారీగా పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వమ మద్యం ధరల పెంపుపై కీలక నిర్ణయం తీసుకునే దశలోనే ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మద్యం ధరల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ మధ్య కాలంలో మద్యం తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను పెంచాలని ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం.
ప్రభుత్వ ఖజానా ఆదాయాన్ని పెంచేందుకు కూడా ఇది మంచి ఛాన్స్ అని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఈ అంశంపై విశ్లేషణ చేపట్టింది. త్రిసభ్య కమిటీ ఈ మేరకు సిఫారసులు చేసినట్లు తెలుస్తోంది. ధరల పెంపుపై పలు అంశాలు సమగ్రంగా అధ్యయనం చేసింది. ఫలితంగా వచ్చే నెల నుంచి కొత్త ధరలను అమలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రీమియం బ్రాండ్లు, బీర్ల ధరలు కనీసం 10 నుంచి 15 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
దేశీయ, విదేశీ మద్యం బ్రాండ్లపై కూడా ఈ ప్రభావం చూపనుంది. ఇది కేవలం వినియోగదారులపై మాత్రమే కాదు..చిన్నపాటి మద్యం దుకాణదారులపై కూడా ప్రభావం పడనుంది. ధరల పెరుగుదల వల్ల అమ్మకాలుకొంత తగ్గే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే అన్ని అనుమతులు పొందిన ఈ నిర్ణయం ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. కొత్త ధరలతో మద్యం ప్రియులకు మళ్లీ ఖర్చులు పెరగడం ఖాయమే.