నాన్ వెజ్ ప్రియుళ్లకు ఆ జాతర ఓ వరం లా మారింది. నెల రోజుల పాటు కాల్చిన మటన్, చికెన్, మద్యంతో ఆ జాతర ప్రాంగణం కిటకిటలాడుతుంటుంది. జాతరలో మాంసం, మద్యం ఏంటి అనుకుంటున్నారా...? అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు వెళ్లాల్సిందే.
మనం ఏదైన ఆలయానికి, లేదా జాతరకు వెళ్లామంటే ముందుగా దర్శనమిచ్చేది... కొబ్బరి కాయలు, పూజసామాగ్రి, పూలు.. ఇక ఆలయానికి వెళ్లే ముందు అక్కడి చిరు వ్యాపారులు పూజా సామాగ్రి కొనాలని రండి రండి అంటూ పిలవడం కనిపిస్తుంది. కానీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్లో ఉన్న కపరుమూర్తి జాతరకు వెళ్తే మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది.
కురుమూర్తి రాయుడి దర్శనం అయ్యాక.. కిందకు దిగివచ్చే భక్తులకు కాల్చిన మటన్ గుమగులు.. రా... రమ్మంటూ పిలుస్తాయి. భక్తులను మాంసం విక్రయదారులు పిలవడం ఇక్కడ దర్శనమిస్తుంది.
కురుమూర్తి జాతరలో రానురాను కాల్చిన మటన్ ఫేమస్గా మారిపోయింది. జాతరలో దాదాపు 50 కి పైగా మటన్ కాల్చే షాపులు ఏర్పడ్డాయి. కాల్చిన మటన్ తినేందుకు హైదరాబాద్, కర్ణాటక నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఇక్కడ మాంసంతో పాటు మద్యం విక్రయాలు కూడా జోరుగానే జరుగుతుంటాయి. జాతరలో ముఖ్య ఘట్టం అయిన ఉద్దాల మహోత్సవం తర్వాత ఈ మటన్ కాల్చే దుకాణాలు ప్రారంభమవుతాయి. దాదాపు నెలరోజుల పాటు మాంసం, మద్యం విక్రయాలు జోరుగా కొనసాగుతాయి.
కురుమూర్తి జాతరకు ప్రతీ ఏడాది భక్తుల తాకిడి పెరుగుతూనే ఉందన్నారు ఆలయ ఈవో. భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు కల్పిస్తున్నామని, మాంసం విక్రయాలు అనాదిగా వస్తున్నందున యథావిదిగా అనుమతులు ఇవ్వాల్సి వస్తుందంటున్నారు ఆలయాధికారులు.
తెలంగాణాలోనే అత్యంత పురాతనమైన ఆలయాల్లో ఈ కురుమూర్తిరాయ ఆలయం ఒకటి. సమ్మక్క.. సారలక్క తరహాలో ఎక్కవ రోజులు జరిగే జాతరకూడా ఈ కురుమూర్తి జాతర. దాదాపు 800 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం 1350 లో నిర్మించినట్టు తెలుస్తుంది.