ప్రాజెక్టుల నిర్మాణంతో సాగునీటి సమస్య తీరుతుంది-కేసీఆర్
చిన్ననీటి వనరుల వినియోగంపై సీఎం కేసీఆర్ సమీక్ష. వాగులపై అవసరమైనన్ని చెక్డ్యాంలు నిర్మించాలి.
ప్రాజెక్టుల నిర్మాణంతో సాగునీటి సమస్య తీరుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ప్రగతి భవన్ లో చిన్ననీటి వనరుల వినియోగంపై నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన కేసీఆర్. మిషన్ కాకతీయ ద్వారా పునరుద్దరించిన చెరువుల నిర్వాహణను ప్రతీ ఏటా చేపట్టాలని ఆదేశించారు. 'కాళేశ్వరం, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల వల్ల గోదావరి నుంచి తెలంగాణ వాటా ప్రకారం పుష్కలమైన నీటిని తీసుకుంటామని వెల్లడించారు. గోదావరి నీళ్లతో ఎల్లంపల్లి, మిడ్మానేరు, లోయర్ మానేరు, ఎస్సారెస్పీ, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లు నింపుతామని చెప్పారు.
రాష్ట్రంలోని అన్ని చెరువులకు ప్రాజెక్టుల ద్వారా నీళ్లు అందిస్తామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా జలధార ఉంటుందని..పుష్కలమైన పంటలు పండుతాయన్నారు. 'ప్రస్తుతం ఏ వాగుకు ఎన్ని చెక్ డ్యాములున్నాయి? కొత్తగా ఎన్ని మంజూరయ్యాయి? ఎన్ని మంజూరు చేయాలో లెక్కలు తీయాలని సూచించారు.. అవసరమైనన్ని చెక్ డ్యాములను గుర్తించిన తర్వాత సగం చెక్ డ్యాములను ఈ ఏడాదే నిర్మించాలని ఆదేశించారు.ఈ నెల15 నాటికి టెండర్లు పిలవాలని.. మిగతా సగం చెక్ డ్యాములను వచ్చే ఏడాది నిర్మించాలన్నారు. ఇందు కోసం బడ్డెట్ లో నిధులు కేటాయిస్తామన్నారు. ప్రతీ వేసవిలో చెరువులోని పూడిక మట్టిని రైతులు పొలాల్లోకి తీసుకువెళ్లేలా ప్రోత్సహించాలని సూచించారు సీఎం కేసీఆర్.