ఎట్ హోం లో రేవంత్‌రెడ్డి, గవర్నర్ నరసింహన్ ల ముచ్చట్లు!

Update: 2019-08-15 15:37 GMT

తెలంగాణా రాజ్‌భవన్‌లో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి, గవర్నర్ నరసింహన్ ల మధ్య జరిగిన చర్చ అందర్నీ ఆకర్షించింది. వారిద్దరి మధ్య నడిచిన సంభాషణ నవ్వుల్నీ పూయించింది. ఎట్ హోం కార్యక్రమానికి వచ్చిన నేతలందరికి గవర్నర్ కరచాలనం చేస్తున్న సమయంలో రేవంత్ రెడ్డితో కాసేపు ముచ్చటించారు. ''వచ్చావా? రాలేదేమోనని నీ కోసమే ఎదురుచూస్తున్నా'' అని గవర్నర్ అన్నారు. దీనికి రేవంత్ బదులిస్తూ ''మీరు ఆహ్వానించాక రాకుండా ఉంటానా?'' అని రేవంత్ బదులిచ్చారు. ''మరి నన్ను కలవడానికి వస్తానన్నారుగా. ఎందుకు రాలేదు'' అన్న గవర్నర్ ప్రశ్నకు రేవంత్ స్పందిస్తూ..''కొడతారేమోనని రాలేదు'' అన్నారు. దీనికి గవర్నర్ అసెంబ్లీలో గతంలో జరిగిన ఘటనను గుర్తు చేస్తూ.. ''నేను కొట్టానా? మీరు నన్ను కొట్టారా?'' అంటూ నాటి ఘటనను గుర్తు చేశారు. దీనికి రేవంత్ కూడా అదే స్థాయిలో బదులిచ్చారు. '' అది మనసులో పెట్టుకుని ఎక్కడ కొడతారోననే రాలేదు'' అనడంతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.

ఆ తర్వాత షబ్బీర్ అలీని గవర్నర్ పలకరిస్తూ.. ''నాపై కోపంగా ఉన్నట్టున్నారే?'' అన్నారు. పక్కనే ఉన్న రేవంత్ వెంటనే కల్పించుకుని ''మా షబ్బీర్ అన్న బిర్యానీ పెడతాడు తప్ప ఎవరినీ కోపగించుకోడు'' అనడంతో వెంటనే గవర్నర్ సతీమణి స్పందించారు. ''ఆయన బిర్యానీ తినడు కదా'' అనడంతో మరోమారు నవ్వులు విరిశాయి.


Tags:    

Similar News