HYDRAA: ఇప్పటి వరకు రూ. 50 వేల కోట్ల విలువైన భూములను రక్షించాం

HYDRAA: హైడ్రా (HYDRA) కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ, ఇప్పటివరకు మొత్తం 923 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి రక్షించినట్లు తెలిపారు.

Update: 2025-09-22 09:26 GMT

HYDRAA: హైడ్రా (HYDRA) కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ, ఇప్పటివరకు మొత్తం 923 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి రక్షించినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రక్షించిన భూముల విలువ సుమారు రూ. 50 వేల కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

హైదరాబాద్ నగరంలో దాదాపు 60 చెరువులు కనుమరుగయ్యాయని, అయితే ఆరు చెరువులకు పూర్తి పునరుజ్జీవం కల్పించామని వివరించారు.

గాజులరామారంలో రౌడీషీటర్లు ప్రభుత్వ భూమిని ఆక్రమించారని, అక్కడ నకిలీ పట్టాలతో నిర్మాణాలు చేపట్టారని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం రోజున ఆ ప్రాంతంలో 260 నిర్మాణాలను తొలగించినట్లు తెలిపారు.

ప్రస్తుతం 51 DRF బృందాలు ఉన్నాయని, వాటి సంఖ్యను త్వరలో 72కు పెంచుతామని చెప్పారు. అలాగే, నగరంలో 150 మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు పనిచేస్తున్నాయని, నాలాల వద్ద ఆక్రమణలను గుర్తించి తొలగిస్తున్నామని వివరించారు.

కాంక్రీటైజేషన్ పెరగడం వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకడం లేదని, అధిక కాలుష్యం కారణంగా నగరాల్లోనే వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తు కోసం యువతరం పార్కులు, చెరువుల ప్రాముఖ్యతపై ఆలోచించాలని ఆయన సూచించారు.

Similar News