Hyderabad Metro: మెట్రో ప్రయాణం.. మరింత కాస్ట్‌లీ..

Hyderabad Metro: హైదరాబాద్‌లో త్వరలో పెరగనున్న మెట్రో ఛార్జీలు

Update: 2023-01-03 01:13 GMT

Hyderabad Metro: మెట్రో ప్రయాణం.. మరింత కాస్ట్‌లీ..

Hyderabad Metro: హైదరాబాద్ నగరానికే తలమానికంగా నిలిచిన మెట్రో రైలులో ప్రయాణం మరింత భారం కానుందా..? రోజు లక్షల మందిని తమ గమ్య స్థానాలకు చేర్చుతున్న మెట్రోలో ఇక ఛార్జీలు పెరగనున్నాయా..? కొత్త సంవత్సరం వేళ ప్రయాణికులపై మెట్రో భారం పడనుందా..? నిర్వహణ భారం, నష్టాలు పూడ్చుకునేందుకు L అండ్ T సంస్థ ఛార్జీలు పెంచేందుకు రంగం సిద్ధం చేసింది. పెంచిన ఛార్జీలు త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ మెట్రో టికెట్ ధరలు.. 2012 మెట్రో ఒప్పందం ప్రకారం మినిమం 8 రూపాయల నుంచి మ్యాగ్జిమమ్ 19 రూపాయల వరకు ఉండాలి. గతంలో కేవలం ఆరు శ్లాబుల్లో మాత్రమే చార్జీలు ఉండేవి. మొదటి రెండు కిలోమీటర్లు 8 రూపాయలు కాగా 2 నుండి 6 కిలోమీటర్లు 10 రూపాయాలు, 6 నుండి 10 కిలోమీటర్లు 12 రూపాయలు, 10 నుండి 14 కిలోమీటర్లు 14 రూపాయలు, 14 నుండి 18 కిలోమీటర్లు 16 రూపాయలు కాగా 18 కిలోమీటర్లు దాటితే 19 రూపాయలు ఉండాలని నిర్ణయించారు. కానీ ప్రస్తుతం ఆరు నుండి 10 శ్లాబులకు పెంచడంతో పాటు 10 రూపాయల నుండి 60 రూపాయలకు రెట్లు పెంచారు. అంటే మెట్రో ప్రారంభంలోనే రెండు వందల శాతం అధికంగా చార్జీలు పెంచారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 రూపాయలు, 15, 25, 30, ఇలా 60 రూపాయల వరకు టికెట్ రెట్లు ఉన్నాయి. ప్రస్తుతం సిటీలో ఆర్టీసికి చెందిన ఆర్డినరీ బస్‌లో 10 రూపాయలు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో 20 రూపాయల కనీస ఛార్జ్ కాగా.. అత్యధికంగా 60 రూపాయలు ఉంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ మెట్రో రైల్ కనీస ఛార్జ్ 20 రూపాయలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గరిష్ఠ టికెట్ ధర మాత్రం 80 నుంచి 90 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ మెట్రో చార్జీలను సవరణ చేసేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సురేందర్ కుమార్, రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, రిటైర్డ్ జస్టిస్ శ్యాంప్రసాద్ లతో కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ కమిటీ నగరవాసులు, ప్రయాణికులు, వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఇప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి పలు అంశాలపై స్టడి చేయనున్నారు సభ్యులు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ధరలను నిర్ణయించే అవకాశం ఉంది.

ఇక హైదరాబాద్ మెట్రోకు కరోనా కారణంగా తీవ్ర నష్టాలు వచ్చినట్లు ఎల్ అండ్ టి అధికారులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. సాఫ్ట్ లోన్ ఇచ్చి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటికి ఎలాంటి స్పందన రాలేదు. మరోవైపు హైదారాబాద్ మెట్రోకు టికెట్ల ద్వరా 50 శాతం ఆదాయం మాత్రమే సమకుర్చుకోవాలి. మిగిలిన దాంట్లో 45 శాతం మాల్స్ వంటి రియల్ వ్యాపారాలు, 5 శాతం వాణిజ్య ప్రకటనల ద్వారా రాబట్టుకోవాలని ఒప్పందం. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మితమైన ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం మియాపూర్ లో 100 ఎకరాలు, ఉప్పల్ లో 103 ఎకరాలతో పాటు సిటిలో ప్రధాన ప్రాంతాల్లో కూడా దాదాపు 60 ఎకరాల వరకు భూములు ఇచ్చింది. అక్కడ మాల్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చుకోని ఆదాయం రాబట్టుకోవాలి. అయితే అక్కడి నుంచి తగిన ఆదాయం రావడం లేదనేది మెట్రో వర్గాల మాట. దాంతో టికెటింగ్ ఆదాయంపై ఫోకస్ చెయ్యాలని మెట్రో భావిస్తున్నట్లు తెలుస్తోంది.

నష్టాల పేరుతో మెట్రో చార్జీలు పెంపు సరికాదని CPM సిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ అంటున్నారు. ఇప్పటికే ఎల్ అండ్ టి అత్యధికంగా ఛార్జీలు వసూలు చేస్తుందనన్నారు. మెట్రోను మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కే పరిస్థితి లేదంటున్నారు. మొత్తంగా ఈ నెలాఖరుకు మెట్రో టికెట్ ధరలను కనిష్ఠ ధర 20 రూపాయల నుంచి గరిష్ఠ ధర 80 రూపాయలకు పెంచనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News