గాంధీలో కరోనా వైరస్ టెస్ట్లు మొదలు.. కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధం : మంత్రి ఈటల
గాంధీలో కరోనా వైరస్ టెస్ట్లు మొదలయ్యాయి. గాంధీ ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. అన్ని రకాలుగా కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.
కరోనా విషయంలో వైద్యశాఖ 24 గంటలు అప్రమత్తంగా ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో మంత్రి ఈటెల గాంధీ మెడికల్ కాలేజీలో వైరాలజీ ల్యాబ్ను పరిశీలించారు. ఇవాళ్టి నుంచి టెస్ట్లు ప్రారంభంకానున్నాయి. తెలంగాణలోకరోనా కేసు నమోదు కాలేదన్న ఈటల చైనా నుంచి వచ్చిన వారిని పర్యవేక్షణలో ఉంచామన్నారు. కరోనా వైరస్ పట్ల తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైందన్నారు. తెలుగు రాష్ర్టాల ప్రజలకు ఇక్కడే వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. ఇక చైనా నుంచి వచ్చిన వ్యక్తులను 24 గంటలపాటు అబ్జర్వేషన్లో ఉంచుతామని మంత్రి పేర్కొన్నారు.