సంతానం లేని దంపతులకు దేవుని అనుగ్రహంతో పిల్లలు పుడతారని గంపెడంత ఆశ నింపుకుంది ఆజంట. ముద్దులొలికే బిడ్డ పుట్టతారని సంతోషంలో విహరించారు ఆదంపతులు. పుట్టే బిడ్డ నాలా ఉంటుందంటే కాదు నాలా ఉంటుందని భార్యాభర్తలు చిలిపిగా గిల్లిగజ్జాలు పెట్టుకున్నారు. నెలలు దగ్గర పడుతున్న కొద్ది వారి ఆశలు రెట్టింపయ్యాయి. కట్చేస్తే అసలు విషయం తెలిసి నివ్వెరపోయారు ఆదంపతులు
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం సొంపల్లి గ్రామానికి చెందిన రమేష్ సోనీకి వివాహమై ఐదేళ్లు గడుస్తోంది. సంతానం లేకపోవడంతో చూపించని డాక్టర్లు లేరు. ఈ మధ్యే ఒంట్లో బాగాలేకపోతే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించగా గర్భం దాల్చావంటూ తీపి కబురు చెప్పారు వైద్యులు. డాక్టర్ చెప్పిన ఆ మాటలతో ఆ దంపతుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. కాసులకు కక్కుర్తి పడ్డ డాక్టర్లు ఇదే ఆసరా చేసుకుని కడపులో కణతి ఉన్నా అది పిండమని నమ్మించింది.
నెలనెల స్కానింగులు, మందులంటూ వేలకు వేలు రూపాయాలు దోచుకుంది సదురు ఆస్పత్రి. నెలలు నిండగానే సదురు డాక్టర్లు సిజేరియన్ చేయాలని రిమ్స్లో చేర్చించారు. అయితే రిమ్స్లో తమనెవరూ పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయేనన్న భయంతో నిర్మల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా అసలు విషయం తెలిసిందన్నారు. అసలు గర్భం దాల్చాలేదని కడుపులో గడ్డ ఉందని చెప్పడంతో షాక్కు గురయ్యారు. తొమ్మిది నెలలుగా తమను మభ్యపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమకు బిడ్డ పుడుతుందని లేని పోని ఆశలు పుట్టించిన ఆస్పత్రిపై రమేష్ కుటుంబసభ్యులు మండిపడుతున్నారు. డబ్బుల కోసం లేనిపోని అబద్ధాలు చెబుతూ తమ జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భం కాదని తెలిసినా నెల నెల పరీక్షల పేరుతో తమను దోచుకున్న ఆస్పత్రిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.