మేడారం సమ్మక్క - సారలమ్మ వీర చరిత్ర
తెలంగాణ కుంభమేళా అనిపిలవబడే సమ్మక్క - సారక్క జాతర పై చరిత్ర చెప్పిన వివరాల ప్రకారం తన కుటుంబ పెద్ద కోసం ఆ కుటుంబంలోని సభ్యులు ప్రాణాలు అర్పించిన త్యాగం మనకు గోచరిస్తుంది.
తెలంగాణ ఇలవేల్పు, వనదేవతలు మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను రెండేళ్ల కొకసారి ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి 5,6,7 తేదీల్లో ఈ జాతర ఉండటంతో భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక జాతర చివరి రోజుల్లో అమ్మవార్ల దర్శనం దొరకడం కష్టం అనుకున్న భక్తులు ముందు నుండే మేడారం జాతరకు పయనమవుతున్నారు. ఇక జాతరలో నాలుగు ఎంతో విశిష్టతను సంతరించుకున్న నాలుగు బుధవారాల్లో ఈ రోజు రెండో బుధవారం కావడంతో భక్తులు తండోపతండాలుగా మేడారం జాతరకు తరలివస్తున్నారు. ప్రతి జిల్లాలోని భక్తులు మేడారానికి తరలి తల్లుల దర్శనం చేసుకుని సమ్మక్క బంగారంతో మొక్కులు చెల్లించుకుంటున్నారు.
సమ్మక్క - సారలమ్మజాతర విశిష్టత
తెలంగాణ కుంభమేళా అనిపిలవబడే సమ్మక్క - సారక్క జాతర పై చరిత్ర చెప్పిన వివరాల ప్రకారం తన కుటుంబ పెద్ద కోసం ఆ కుటుంబంలోని సభ్యులు ప్రాణాలు అర్పించిన త్యాగం మనకు గోచరిస్తుంది. జాతర గురించి ముందుగా తెలుసుకోవాలంటే మనదేశంలో కుంభమేళా తరువాత అతిపెద్ద గిరిజన పండుగగా చెప్పుకునే ఈ జాతరకు అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. కాబట్టే ఈ పండగను తెలంగాణ కుంభమేళా అనిపిలుస్తారు. ములుగు జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన జాతర జరుగుతుంది. సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కష్టాలు కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపధ్భాందవులుగా మనదేశంలోనే వనదేవతులుగా సమ్మక్క-సారక్క లు పూజలందుకుంటున్నారు.
ఎవరీ సమ్మక్క- సారలమ్మ?
12వ శతాబ్దంలో కరీంనగర్ జిల్లా జగిత్యాలలో ఉన్న 'పొలవాస' ను పరిపాలించే గిరిజన దొర మేడరాజు. అయితే తన ఏకైక కుమార్తె సమ్మక్కను మేనల్లుడైన మేడారంను పాలించే పగిడిద్ద రాజుకు ఇచ్చి వివాహం చేసారు. ఈ పుణ్యదంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు. ఇదిలా ఉంటే కాకతీయల మొదటి ప్రభువు ప్రతాప రుద్రుడికి రాజ్య విస్తరణ చేయాలనే కోరిక ఉండేది. అందుకోసం తన సైన్యంతో ఇతర రాజ్యలపై దండెత్తి వారిని ఓడించి రాజ్యాలను తన రాజ్యంలో కలుపుకునేవాడు. అలా రాజ్యవిస్తరణలో భాగంగా ప్రతాపరుద్రుడు గిరిజన దొర మేడరాజు పాలించే పొలవాసపై దండెత్తుతాడు. ఈ దండయాత్రలో ప్రతాపరుద్రుడి దాడితట్టుకోలేని మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసము గడుపుతుంటాడు. ఇక మేడారాన్ని పాలించే కోయరాజు "పగిడిద్దరాజు" కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటకలతో పన్నుచెల్లించలేకపోతాడు. రాజ్యం విస్తరణ కాంక్షలో ప్రతాపరుద్రుడు మేడారాన్ని దక్కించుకోవాలనే దురుద్దేశంతో పగిడిద్ద రాజుపై కుట్రపన్నుతాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనులలో తనకు వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడంటూ ప్రతాపరుద్రుడు అతడిని అణచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారం పై దండెత్తుతాడు. సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్ద రాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవింద రాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేస్తారు. కాని కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవింద రాజులు యుద్ధంలో చనిపోతారు.
జాతర విశిష్టత
జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలుకల గుట్టలో కుంకుమభరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దేవతలను గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగి పోతారు. మూడో రోజు అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు. నాలుగో రోజు సాయంత్రం దేవతలను యుద్ద స్థానానికి తరలిస్తారు.
ఇక పోతే వంశ పారంపర్యంగా వస్తున్న గిరిజనులే ఈ జాతరకు పూజారులు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం (బెల్లము) నైవేద్యంగా సమర్పించుకుంటారు. ఈ జాతరకు గిరిజనులు మాత్రమే కాదు అనేక కులాల వారు, మతాల వారు కూడా ఇక్కడికి వస్తారు. ప్రతి ఏడాది దాదాపుగా కోటి మంది భక్తులకు పైగా ఆ జాతరలో పాల్గొంటారు. అందుకూ ఈ జాతర ఆసియాలోనే అతి పెద్ద జాతరగా పేరుపొందింది.
తెలంగాణా కుంభమేళా
తెలంగాణాలో జరిగే అతిపెద్ద, విశిష్ట గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మల జాతర. 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940 వ సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునే వారు. కాని 1940 తర్వాత తెలంగాణ ప్రజలంతా కలిసి ఈ జాతరను జరుపుకుంటున్నారు. ప్రతి ఏటా ఆ జాతరకు తరలి వచ్చే జనం పెరుగుతుండడంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు. అమ్మవార్ల చిహ్నంగా గద్దెలు ఏర్పాటుచేయబడి ఉంటాయి. ఈ గద్దెలపైకి జాతర రోజు అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరిణేలను తీసుకువస్తారు, పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా మధ్య ప్రదేశ్, చత్తిస్ ఘడ్, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాల నుంచి సుమారు కోటికి పైగా భక్త జనం వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు . దీంతో ఈ జాతరను 1996 లో ఆంధ్ర ప్రదేశ్, ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది.