తెలంగాణలోని పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. జబ్బులపాలయినప్పుడు వైద్యం చేయించుకోవడానికి కూడా ఆర్థిక స్థోమత లేని వారికోసం ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందిస్తుంది. ఎంతో మందికి వస్తున్న ఎన్నో రకాల జబ్బులకు ఉచిత వైద్యం అందిచినట్టుగానే కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారికోసం జిల్లా, ఏరియా దవాఖానల్లో ఎంతో ఖర్చుతో కూడుకున్న డయాలసిస్ సేవలను ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. కిడ్నీ సమస్యలున్నవారికి వారానికి రెండు, మూడుసార్లు డయాలసిస్ అందించాల్సి ఉంటుంది. అలాంటి వారికి ఎలాంటి ఇన్ఫెక్షన్ లు రాకుండా నాణ్యమైన సింగిల్ యూజ్డ్ డయాలసిస్ విధానాన్ని అవలంభిస్తున్నది.
ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ సింగిల్ యూజ్డ్ డయాలసిస్ విధానాన్ని రూ.2 వేలు వెచ్చించి అమలుచేస్తున్నారు. అంతే కాకుండా రోగులను చూడడానికి వచ్చిన వారి అటెండెంట్లకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.
ఇప్పటివరకూ డయాలసిస్ చేసేందుకు ఒకటి రెండు కేంద్రాలు మాత్రమే ఉండగా వాటిని మూడు కస్టర్లుగా 41 సర్కార్ దవాఖానల్లో 268 డయాలసిస్ మిషన్లను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగానే క్లస్టర్-1 కింద గాంధీ దవాఖాన పరిధిలోని మహబూబాబాద్, నర్సంపేట, కరీంనగర్, జగిత్యాల, గోదావరిఖని, సత్తుపల్లి, భద్రాచలం, జనగామ, వరంగల్, సిరిసిల్ల, కొత్తగూడెం ఏరియా, జిల్లా ఆస్పత్రి పరిధిలో 69 మిషన్ల ద్వారా రోగులకు డయాలసిస్ నిర్వహిస్తున్నారు.
ఇక క్లస్టర్ 2 కింద నిమ్స్ దవాఖాన పరిధిలో గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, ఆదిలాబాద్, మంచిర్యాల, సిద్దిపేట, నిర్మల్, వనస్థలిపురం, వికారాబాద్, సంగారెడ్డి, గజ్వేల్, ఉట్నూర్, నారాయణ్ఖేడ్, తాండూరు, జహీరాబాద్, మహేశ్వరం ఏరియా, జిల్లా దవాఖానల్లో 103 మిషన్లు, క్లస్టర్ 3 కింద ఉస్మానియా దవాఖాన పరిధిలో మలక్పేట, బోధన్, నిజామాబాద్, బాన్సువాడ, కామారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, హుజూర్నగర్, మిర్యాలగూడ ఏరియా, జిల్లా దవాఖానల్లో 58 మిషన్ల ద్వారా డయాలసిస్ సేవలను అందిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇంకా ఎక్కువ మొత్తంలో ఈ డయాలసిస్ సేవలను విస్తృతం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. మరింత మంది రోగులకు ఉచిత సేవలు అందించేందుకు రూ.13.81కోట్లతో వైద్య, ఆరోగ్యశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.