Kavitha with Singareni Coal Mines Workers Protest: కమలంపై యుద్దానికి కవిత రెఢీనా.. రీఎంట్రీకి సింగరేణి వేదికవుతోందా?

Update: 2020-06-30 11:43 GMT

Kavitha with Singareni Coal Mines Workers Protest: రాజకీయాల్లో ఓ అడుగు వెనక్కి తగ్గినా కాలం కలిసొస్తే రెండు అడుగులు ముందుకు పడతాయా? టిఆర్ఎస్ ఫైర్ బ్రాండ్, సిఎం కూతురు కల్వకుంట్ల కవిత ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారా? రానున్న రోజులు ఇక కవితవేనా? ఓటమి బాధతో ఇక రాజకీయాలతో సంబంధమే లేదని చెప్పినట్టె చెప్పి సైలంట్‌గా ఉన్న ఆ లేడీ ఫైర్ బ్రాండ్ దూసుకెళ్లడమే బెటరని డిసైడ్ అయ్యారా? సింగరేణి ప్రైవేటీకరణ ఉద్యమాన్నే పునరాగమన ప్రస్థానానికి వేదిక చేసుకోబోతున్నారా? ఒకేసారి ఎమ్మెల్సీతో పాటు కేబినెట్‌ బెర్త్ ఖాయమనే ప్రచారంలో వాస్తవం ఎంత? కార్మిక క్షేత్రం సహా అన్ని పదవులకు దూరం ఉన్న కవిత, ఉన్నపళంగా సింగరేణి ఉద్యమాన్ని భుజానేసుకోవడంలో ఆంతర్యమేంటి?

కల్వకుంట్ల కవిత...డైనమిక్ లీడర్..తెలంగాణ యూత్ ఐకాన్.. మాటల మాంత్రికురాలిగా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న మహిళా నాయకురాలు. నిజామాబాద్‌ ఓటమితో సైలెంట్‌ అయ్యారు. కానీ ఇప్పుడు కవితను చూసి బాస్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. నిన్నటి వరకు ఎవ్వరికీ అపాయిట్‌మెంట్లు ఇవ్వని కవిత, ఇప్పుడు కార్యక్షేత్రంలోకి దిగి క్యాడర్‌తో కలిసిపోవాలని డిసైడ్ అయినట్టున్నారు. నిజామాబాద్ జిల్లాకు ఎంత చేసినా మొన్నటి పార్లమెంట్ ఎన్నిక‌ల్లో ఓటమితో కవిత సహా కల్వకుంట్ల కుటుంబమంతా తీవ్ర నైరాశ్యంతో ఉందన్నది వాస్తవం. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని ఎంత నచ్చచెప్పినా, ఏడాది పాటు ఓటమి బాధతో ఇంటివద్దే ఉన్నారు. నిజామాబాద్‌పై కన్నెత్తి కూడా చూడలేదు. అంతేకాదు ఎవ్వరికీ అపాయింట్ మెంట్లూ ఇవ్వకుండా పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఇక, కవిత రాజకీయల్లో దూరంగా ఉంటారని భావించారు.

పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన కవిత, నిజామాబాద్ ఓటమి దెబ్బకు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకున్నారట. ఇదే సమయంలో ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరం పెట్టాలో కూడా అనుభవంలోకి తెచ్చుకున్నారట. అందుకే యాక్టివ్ పాలిటిక్స్ లోకి విధిగా రావాలని డిసైడ్ కావడంతో, నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల నోటిఫికేష‌న్ ఆమెకు కలిసివచ్చింది. దీంతో కవిత ఎమ్మెల్సీ అవ్వడం లాంఛనమే.

ఇంతవరకు ఓకే కవిత ఎమ్మెల్సీగానే కాకుండా కేబినేట్ లో బెర్త్ కూడా కన్‌ఫాం అయ్యిందనే పొలిటికల్ టాక్ చక్కర్లు కొడుతోంది. దీనికి తోడుగా క‌విత ఇప్పుడు పూర్తిస్థాయిలో ఫీల్డ్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ముందుగానే గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చి బిజెపిపై కత్తులు దూయడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారట. అందుకే తాజాగా దేశవ్యాప్తంగా కొన్ని బొగ్గు గ‌నుల‌ను ప్రైవేటీక‌ర‌ణ చేస్తూ తీసుకున్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై, అగ్గిమీద గుగ్గిలమవుతున్నారట. ఓ అడుగు ముందుకేసి ఏకంగా బిజెపి దిష్ఠిబొమ్మల ద‌హ‌నాలు, 24 గంట‌ల సింగరేణి స‌మ్మెకు క‌విత పిలుపునిచ్చారు. దీంతో టిఆర్ఎస్ వ‌ర్గాల్లో ముఖ్యంగా సింగ‌రేణి కార్మిక సంఘాల్లో కొత్త జోష్ వ‌చ్చేసింది.

కవిత పొలిటికల్ రీఎంట్రీ కేబినెట్‌లో చోటుపై టిఆర్ఎస్ ముఖ్య నాయకులు కూడా ఖండించలేకపోతున్నారు. ఒకవేళ మంత్రివర్గంలో కవితకు చోటు దక్కితే, అటు సామాజికకోణంలో, ఇటు మహిళా కోటాలో ప్లస్ లు మైనస్ లు అన్నీ కూడా లెక్కకట్టారట. చూడాలి, కవిత మలి ప్రస్థానం ఎలా వుండబోతోందో.


Full View


Tags:    

Similar News