Etela Rajender Review on Corona Cases: వ్యాధులను ఎదుర్కొనే సత్తా మన సొంతం : మంత్రి ఈటల రాజేందర్

Update: 2020-07-28 12:36 GMT
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఈటల

Etela Rajender Review on Corona Cases: చాపకింద నీరులా ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి మానవాళి మొత్తానికి పెను సవాలుగా తయారైందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. వరంగల్‌ నగరంలో కరోనా కేసుల తీవ్రత గత రెండు మూడు రోజులుగా పెరుగుతుండడంతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుతో కలిసి ఈటల రాజేందర్ సి.ఎస్.ఆర్ గార్డెన్స్‌లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కరోనా వైరస్ కట్టడి చేయడం, నివారన పెను సవాల్‌గా మారిందన్నారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తూ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో 81 శాతం మంది బాధితులు కరోనా లక్షణాలు లేకుండానే కోలుకోవడమే ఇందుకు నిదర్శనమని ఈటల అన్నారు. కరోనా బాధితులకు అన్ని రకాలుగా అండగా నిలిచి వారికి మరింత సేవలందించాలని ఆరోగ్య అధికారులకు మంత్రి సూచించారు. కరోనా వైరస్‌ను సకాలంలో గుర్తించని వారికి ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆయన అన్నారు. కరోనా సోకిందని ప్రజలు భయపడకుండా వైరస్‌ను ధైర్యంగా ఎదుర్కొందామని ఈటల పిలుపునిచ్చారు. వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న వారు తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యులను సంప్రదించాల్సిందేనని మంత్రి సూచించారు. పూర్వం అనేక రకాల ప్రమాదకర వ్యాధులను ఎదుర్కొని వాటి నుంచి సురక్షితంగా బయటపడ్డ సత్తా మన సొంతమని గుర్తు చేశారు.

అనంతరం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాట్లాడారు. ప్రభుత్వం దగ్గర నిధులకు కొరత లేదని ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాల పెంపునకు అధికంగా ఖర్చు చేయాలని గతంలోనే సీఎం నిర్దేశించినట్లు ఎర్రబెల్లి చెప్పారు. ప్రస్తుత పరిస్థితులను ప్రతిఒక్కరూ ఓ సవాలుగా స్వీకరించి పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎంపీలు బండ ప్రకాశ్‌, కవిత, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పెద్ది సుదర్శన్‌ రెడ్డి, నన్నపనేని నరేందర్‌, సీతక్క తదితరులు పాల్గొన్నారు.




Tags:    

Similar News