డ్రంక్ అండ్ డ్రైవ్ తొలి కేసు
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ట్రాఫిక్ అధికారులు మొన్నటి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను నిర్వహించడాన్ని నిషేధించిన విషయం తెలిసిందే.
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ట్రాఫిక్ అధికారులు మొన్నటి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను నిర్వహించడాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. కాగా మంగళవారం రాత్రి నుంచి పోలీసులు మళ్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడం ప్రారంభించారు. ఈ పరీక్షలో చాలా రోజుల తరువాత తొలి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదైంది. పూర్తివివరాల్లోకెళ్తే కోఠి వైపు నుంచి ఖళీగా వస్తున్న ఓ గూడ్స్ ఆటో పుత్లిబౌలి చౌరస్తాలో బోల్తా కొట్టింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఈ ప్రమాద విషయం తెలుసుకున్న ఏసీపీ శ్రీనివాస్రెడ్డి సహా కొంత మంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు. డ్రైవర్ కదలికలను గమనించిన ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి ఆటోడ్రైవర్కు డ్రంక్ డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించాల్సిందిగా ఆదేశించారు. దీంతో సమీపంలోని సుల్తాన్బజార్ ట్రాఫిక్ పోలీసులు తమ వద్ద ఉన్న బ్రీత్ ఎనలైజర్తో పరీక్ష చేశారు. ఈ పరీక్షలో డ్రైవర్ మద్యం తాగినట్లు తేలింది. వెంటనే ట్రాఫిక్ పోలీసులు ఆటోను స్వాధీనం చేసుకుని డ్రైవర్ పై కేసు నమోదు చేశారు.
ఇక పోతే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేయడానికి బ్రీత్ ఎనలైజర్తో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం ప్రమాదం అని నిలిపివేసారు. అంతే కాకుండా లాక్ డౌన్ కారణంగా వాహనాలు కూడా ఎక్కువగా రోడ్లపై తిరగకపోవడం కూడా టెస్టులు నిర్వహించకపోవడానికి ఒక కారణమే. కాగా ప్రస్తుతం ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపు ఇవ్వడంతో మద్యం దుకాణాలు నడుస్తున్నాయి, అదే విధంగా వాహనాలన్నీ రోడ్లపై తిరుతున్నాయి. దీంతో ట్రాఫిక్ విభాగం సిబ్బంధి డ్రంక్ డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు వారు మంగళవారం నుంచి నిఘా ముమ్మరం చేశారు. నిన్నటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాని పట్టణంలో ఈ తనిఖీల్లో మొట్టమొదటి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదయింది.