వేములవాడ: లాక్ డౌన్ నియమాలను ప్రజలందరూ పాటిస్తూ జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కృష్ణ భాస్కర్ విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ ముగిసే వరకు ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని కలెక్టర్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో లాక్ డౌన్ పరిస్థితులపై ఎస్పీ రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్ అంజయ్య, వేములవాడ డీఎస్పీ చంద్ర కాంత్ లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... లాక్ డౌన్ ముగిసే వరకు జిల్లాలోకి వ్యక్తుల ప్రవేశం లేకుండా సరిహద్దు చెక్ పోస్టుల వద్ద తనిఖీలు పటిష్ఠం చేయాలన్నారు.
వేములవాడ, సిరిసిల్ల పట్టణాలలో నిత్యావసర సరుకులకు ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11.00 గంటల వరకే అనుమతించనున్నట్లు చెప్పారు. నిత్యవసర వస్తువులను కొనే సమయంలో ప్రజలు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలన్నారు. అనతరం ఎస్పీ మాట్లాడుతూ... రెడ్ జోన్ ప్రాంతాల్లో ఉల్లంఘనలు జరగకుండా పటిష్ట నిఘా పెట్టామని... అనుమతి లేకుండా జిల్లాలోకి ప్రవేశించే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. అనుమతి లేకుండా ప్రవేశించి వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా క్వారంటైన్ కు పంపుతామని ఎస్పీ తెలిపారు.