Jeevan Reddy: కాంగ్రెస్లో ముదిరిన టికెట్ల చిచ్చు.. 'నా మెడ కోశారు' అంటూ జీవన్ రెడ్డి ఆవేదన!
Jeevan Reddy: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి మొదలైన వేళ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి.
Jeevan Reddy: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి మొదలైన వేళ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. జగిత్యాల మున్సిపాలిటీలో టికెట్ల కేటాయింపుపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే టి. జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆయన ఆవేదన చెందారు.
ఎమ్మెల్యే వర్గానికే ప్రాధాన్యత?
జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో అభ్యర్థుల ఎంపికలో అన్యాయం జరిగిందని జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి ఏకంగా 30 టికెట్లు కేటాయించారని, తన వర్గానికి కేవలం 20 టికెట్లు మాత్రమే ఇచ్చారని ఆయన ఆరోపించారు. "ఈ చర్యతో నా మెడ కోశారు" అంటూ ఆయన తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరిగిందని ఆయన వాపోయారు.
జీవన్ రెడ్డి నివాసానికి కార్యకర్తల క్యూ
జీవన్ రెడ్డి అసంతృప్తి వార్త తెలియగానే జగిత్యాలలోని ఆయన నివాసానికి కార్యకర్తలు, స్థానిక నేతలు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. టికెట్లు దక్కని అభ్యర్థులు తమ ఆవేదనను ఆయన ముందు వెళ్లగక్కుతున్నారు. ఈ పరిణామం జగిత్యాల కాంగ్రెస్లో అలజడి సృష్టిస్తోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అదిష్టానం ఈ విషయంలో ఎలా జోక్యం చేసుకుంటుందోనన్నది ఆసక్తికరంగా మారింది.