Revanth Reddy: తెలంగాణలో కూడా ఓ ట్రంప్ ఉండేవాడు

Revanth Reddy: తెలంగాణలో గతంలో ఓ డొనాల్డ్ ట్రంప్ ఉండేవారని, ఆయన పాలన నచ్చక ప్రజలు ఆయనను ఓడించి ఫామ్‌హౌస్‌లో కూర్చోబెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-09-19 09:13 GMT

Revanth Reddy: తెలంగాణలో గతంలో ఓ డొనాల్డ్ ట్రంప్ ఉండేవారని, ఆయన పాలన నచ్చక ప్రజలు ఆయనను ఓడించి ఫామ్‌హౌస్‌లో కూర్చోబెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన 'బిజినెస్ స్టాండర్డ్స్ యాన్యువల్ ఫోరం'లో పాల్గొన్న ఆయన, మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి పరోక్షంగా ఈ విమర్శలు చేశారు.

ఈ సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. "ట్రంప్ లాంటి వ్యక్తుల ఆటలు ఎక్కువ రోజులు సాగవు. వారు రాత్రి కలలో అనుకున్నది పగలు అమలు చేస్తుంటారు. ట్రంప్ ఒకరోజు మోదీ తన మిత్రుడు అంటారు, మరుసటి రోజే భారత్‌పై 50 శాతం సుంకాలు విధిస్తానని బెదిరిస్తారు" అని రేవంత్ విమర్శించారు. భవిష్యత్తులో భారతీయులకు వీసాలు ఇవ్వకపోతే నష్టపోయేది అమెరికానే అని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలంగాణ అభివృద్ధికి తమ ప్రభుత్వానికి స్పష్టమైన రూట్‌మ్యాప్ ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.

హైదరాబాద్‌ను కాలుష్య రహితంగా మార్చే ప్రణాళికలో భాగంగా, త్వరలో 3,000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ప్రస్తుతం నడుస్తున్న నాన్-ఈవీ బస్సులను పూర్తిగా గ్రామాలకు తరలిస్తామని స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని గుర్తు చేశారు.

హైదరాబాద్-బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు ఏర్పాటు ప్రతిపాదన ఉందని, ఔటర్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా రీజనల్ రింగ్ రోడ్డును నిర్మిస్తున్నామని తెలిపారు.

డ్రగ్స్‌ను నిర్మూలించేందుకు ఏర్పాటు చేసిన 'ఈగల్ స్క్వాడ్' సమర్థవంతంగా పనిచేస్తోందని, ఇటీవల విడుదలైన పోలీస్ ర్యాంకింగ్‌లో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందని సీఎం వెల్లడించారు.

Tags:    

Similar News