తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం ఖరారు చేశారు. ఆర్టీసీ సమ్మె ఎజెండాగా రేపు కేబినెట్ సమావేశం జరగనుంది. ఆర్టీసీ సమ్మె, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ఆర్టీసీ వ్యవహారంలో తెలంగాణ సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. సమ్మెపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా శనివారం కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది.
సర్వత్రా చర్చనీయాంశమైన ఆర్టీసీ వ్యవహారమే ప్రధాన ఎజెండాగా కేబినెట్ భేటీ కానుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఈ అంశంపై హైకోర్టు కూడా ఘాటుగా స్పందించింది. మరోవైపు సమ్మె కారణంగా అటు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే, మున్సిపల్ ఎన్నికలు తదితర అంశాలపైనా ఈ కేబినెట్ భేటీలో చర్చించనున్నారు సీఎం.
అయితే, ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ రవాణా విధానాన్ని అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఆర్టీసీలో 50 శాతం యాజమాన్యం బస్సులు, 30 శాతం అద్దె బస్సులు నడుపుతూ మిగతా 20 శాతం ప్రైవేట్ బస్సులకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. వాటి కోసం ప్రత్యేకంగా స్టేజ్ కేరియర్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఆర్టీసీలో ప్రస్తుతం 26 శాతం అద్దె బస్సులు ఉన్నాయి. అదనంగా 4 శాతం అద్దె బస్సుల కోసం ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో అద్దె బస్సుల 30 శాతం కోటా పూర్తవుతుంది.
ఇక ప్రైవేట్ బస్సులు, వాటిని నిలపడానికి స్టేజ్ కేరియర్ల కోసం అనుమతులు ఇస్తే సరిపోతుంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన చట్టం ప్రకారం ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కోసం ప్రైవేట్ స్టేజ్ కేరియర్లకు అనుమతులు ఇవ్వవచ్చని సీఎం కేసీఆర్ ఇప్పటికే తెలిపారు. అందుకు అనుగుణంగా అనుమతులు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. వీటితో పాటు హైదరాబాద్ మెట్రో రైలుకు సర్వీసుల అనుసంధానం, సెట్విన్ సర్వీసు సేవలను మరింత మెరుగ్గా వినియోగించుకోవడం లాంటి ప్రతిపాదనలను ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. వీటన్నింటిపై కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.